ఐఫోన్ ఎస్ఈ 4 ఎల్సీడీ డిస్‌ప్లేతో రానుందని గతంలో లీకులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్‌లో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. డిస్‌ప్లే సప్లై చెయిన్ కన్సల్టెంట్ విశ్లేషకుడు రాస్ యంగ్ ఈ విషయాన్ని తెలిపారు. యాపిల్ ఉత్పత్తుల గురించి ఈయన చెప్పిన విషయాలు ఎప్పుడూ నిజం అయ్యాయి.


ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్‌ను యాపిల్ ఇంకా ఫైనల్ చేయలేదని రాస్ తెలిపారు. 6.1 అంగుళాల ఎల్సీడీ ప్యానెల్ బదులు ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించాలని యాపిల్ చూస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం యాపిల్ 5.7 అంగుళాలు, 6.1 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను వేర్వేరు సప్లయర్ల నుంచి తయారు చేయిస్తుంది.


గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఐఫోన్ ఎస్ఈ 4 డిజైన్ చూడటానికి 2018లో లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్ఆర్ తరహాలో ఉండనుంది. ఐఫోన్ ఎస్ఈ మొదటి మోడల్ 2016లో లాంచ్ అయింది. 2013లో వచ్చిన ఐఫోన్ 5ఎస్‌కి పలు మార్పులు చేసి ఐఫోన్ ఎస్ఈగా లాంచ్ చేశారు. ఐఫోన్ ఎస్ఈ 2022ని ఐఫోన్ 8 ఆధారంగా రూపొందించారు.


గతంలో వచ్చిన కథనాల ప్రకారం ఐఫోన్లలో టచ్ ఐడీని తిరిగి తీసుకురావాలని యాపిల్ ప్రయత్నిస్తుంది. అయితే ఈ ఫీచర్ ఇప్పట్లో తిరిగొచ్చే అవకాశం లేదు. టచ్ ఐడీని పవర్ బటన్‌కు అటాచ్ చేయడం లేదా ఇన్‌డిస్‌ప్లే టచ్ ఐడీని అందించే ఆప్షన్లను యాపిల్ పరిశీలిస్తుంది. ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీల్లో టచ్ ఐడీని పవర్ బటన్‌కు అటాచ్ చేశారు.


గత కొన్ని సంవత్సరాల్లో హైఎండ్ ఐఫోన్లలో టచ్ ఐడీని తిరిగి తీసుకురావడానికి డిస్కషన్లు జరుగుతున్నాయి. కొన్ని ఆప్షన్లను యాపిల్ ఇప్పటికే ప్రయత్నిస్తుంది. ఫేస్ ఐడీతో పాటు టచ్ ఐడీని కూడా ఫ్లాగ్ షిప్ ఐఫోన్లకు రానున్న సంవత్సరాల్లో తీసుకొచ్చే అవకాశం ఉంది.