ఓపెన్ సోర్స్ డెవలపర్ ప్లాట్‌ఫాం ‘గిట్‌హబ్’ తన ఇంజినీరింగ్ టీమ్ మొత్తాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. గిట్‌హబ్ మైక్రోసాఫ్ట్‌కు చెందిన కంపెనీ. అమెరికా తర్వాత భారతదేశంలో ఉన్న గిట్‌హబ్ సెంటరే కంపెనీకి అతి పెద్ద డెవలపర్ల కమ్యూనిటీ. గిట్‌హబ్‌కు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. భారతదేశంలోనే గిట్‌హబ్ డెవలపర్లు కోటికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.


భారతదేశంలో గిట్‌హబ్ 142 మందిని తొలగించింది. తొలగించిన వారిలో బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ ఆఫీసుల్లో పని చేసే వారు కూడా ఉన్నారు. ఈ విషయమై గిట్‌హబ్ ప్రతినిధిని సంప్రదించినప్పుడు అతను కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు.


‘కంపెనీ రీఆర్గనైజేషన్ ప్లాన్‌లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం. లాంగ్ టర్మ్‌లో ముందుకు ఎలా సాగాలి అనే వ్యూహంలో భాగంగా షార్ట్ టర్మ్‌లో వ్యాపారాన్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదు. బిజినెస్ ఆపరేషన్స్‌పై మేం మరింత దృష్టి సారించనున్నాం. అందులో భాగంగా రోల్ ఎలిమినేషన్స్ తప్పడం లేదు. భారతీయ మార్కెట్‌కు తగ్గ సేవలను అందించడానికి మేం ఎంతో కమిటెడ్‌గా ఉన్నాం. ప్రస్తుతం మేం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంలోని కోటి మంది డెవలపర్లపై ఎటువంటి ప్రభావం చూపించదు.’ అని గిట్‌హబ్ ప్రతినిధి తెలిపారు.


ఈ సంవత్సరం జనవరిలో 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. 2018లో జూన్ 2వ తేదీన మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్‌ను 7.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. గిట్‌హబ్‌ను 2007లో స్థాపించారు.


ఆర్థిక మాంద్యం భయాలతో ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. గూగుల్ (ఆల్ఫాబెట్), మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు కూడా వేల సంఖ్యలో సిబ్బందిని తీసేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాయి.


బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం... 2023 జనవరి 20న, Google CEO సుందర్ పిచాయ్ లే-ఆఫ్స్‌ గురించి తన ఉద్యోగులకు ఒక ఈ-మెయిల్ పంపారు. వర్క్‌ఫోర్స్‌ను తగ్గించడానికి వివిధ విభాగాల నుంచి 12,000 మంది ఉద్యోగులను Google తొలగిస్తోంది.


ఒక డేటా ప్రకారం, 'భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ 3000 మంది తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. కొన్ని ప్రధాన టెక్ కంపెనీలు పెద్ద సంఖ్యలో తొలగింపులను ప్రకటించినందున, రాబోయే కాలంలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చు'.


ఈ పరిస్థితుల్లో... కంపెనీలు ఇంత వేగంతో ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నాయి, భారతదేశ ప్రజలను ఎంత వరకు ప్రభావితం చేస్తుంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


పట్నా యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ వినయ్‌తో ABP మాట్లాడింది. ఈ సంవత్సరం టెక్ కంపెనీలకు బాగోలేదని ఆయన చెప్పారు. గ్లోబల్ మాంద్యం భయాల వల్ల ఇంకా చాలా కంపెనీలు తమ ఉద్యోగులను తొలగిస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా, కాంట్రాక్ట్‌పై పని చేస్తున్నవాళ్లు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నప్పుడల్లా, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల మీదే తొలి వేటు పడుతుంది.


మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్, తన కంపెనీ నుంచి 11,000 మంది ఉద్యోగులను తొలగించడానికి కారణం పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇవ్వడమే. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులు అనారోగ్యానికి గురయ్యారు.