మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బీ (Micromax in 2b)
మైక్రోమాక్స్‌  రెండు కొత్త మోడల్స్‌ని ప్రవేశపెట్టనుంది. మైక్రోమాక్స్‌ ఇన్‌ 2బీ, ఇన్‌ 2బీబీ పేరుతో వీటిని తీసుకురానుంది. హై-రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లేతో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో ఇన్‌ 2బీని జులై 30న మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. దీని ధర రూ.15,000 లోపు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. ఇక ఇన్ 2బీబీ మోడల్‌ని ఆగస్టు రెండు లేదా చివరి వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇవేకాకుండా మైక్రోమాక్స్‌ 5జీ ఫోన్‌ను కూడా తీసుకురానుంది. 


గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌ (Google Pixel 6 Series)
గతంలో వచ్చిన పిక్సెల్‌ మోడల్స్‌కి భిన్నంగా గూగుల్ పిక్సెల్ 6 , 6ప్రో మోడల్స్‌ని తీసుకొస్తున్నారు. ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే, 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉన్నాయని తెలుస్తోంది. 8జీబీ ర్యామ్‌/ 512జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్లో విడుదల చేయనున్నారు. వీటి ధర సుమారు రూ. 55,000 వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఆగస్టు రెండో వారంలో భారత మార్కెట్లో విడుదల చేస్తారని టాక్.





మోటోరోలా (Motorola)
మోటోరోలా కూడా రెండు కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌ని ఆగస్టులో విడుదల చేయనుంది. వీటిలో ఒక ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వెనక వైపు మూడు కెమెరాలు ఇస్తున్నారట. దీని ధర సుమారు రూ. 20,000 ఉండొచ్చని సమాచారం. మరో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 879 ప్రాసెసర్ ఉపయోగించారట. దీని ధర సుమారు రూ. 25,000 ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. ఈ మోడల్‌ను ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో విడుదల చేయనున్నారు.   


అసుస్‌ 8జెడ్‌ (Asus  8Z) 
కాంపాక్ట్ డిజైన్‌తో అసుస్ 8జెడ్‌ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను ఆగస్టులో భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 888 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 120Hz రిఫ్రెష్‌ రేట్‌తో 5.9-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అడ్రినో 660 గ్రాఫిక్‌ కార్డ్‌ ఇస్తున్నారు.  వెనకవైపు సోనీ లెన్స్‌తో 64 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 12 ఎంపీ సెకండరీ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో సెల్ఫీల కోసం 12 ఎంపీ సోనీ లెన్స్ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 




రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్ (Realme GT Master Edition) 
ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో రియల్‌మీ జీటీ మాస్టర్‌ ఎడిషన్ ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. హై-రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం.  దీని ధర రూ. 25,000 వరకూ ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. దీనితోపాటు మైక్రోమాక్స్‌ ఇన్, రెడ్‌మీ 10 సిరీస్‌ వేరియంట్లకు పోటీగా బడ్జెట్ ధరలో రియల్‌మీ సీ సిరీస్ పేరుతో కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. వీటిని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. 


పోకో ఎక్స్‌3 జీటీ (Poco X3 GT)
కొద్దిరోజుల క్రితం గేమింగ్‌ ఫీచర్లతో ఎఫ్3 జీటీ మోడల్‌ను పోకో కంపెనీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. తాజాగా ఎఫ్‌3 జీటీ పేరుతో మరో కొత్త మోడల్‌ని ఆగస్టు చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇందులో 6.6-అంగుళాల డిస్‌ప్లేతోపాటు 64ఎంపీ ప్రధాన కెమెరా, 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ వంటి ఫీచర్స్ ఉండనున్నాయట.




వివో వీ21 ప్రో (Vivo v21 Pro)
ఈ సిరీస్‌లో వివో ఇప్పటికే వీ21, వీ21ఈ  5జీ మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలో వీ21 ప్రో పేరుతో మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 6.44-అంగులాల ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లేతోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 800 ప్రాసెసర్‌, 64 ఎంపీ ప్రైమరీ కెమెరా   ఫీచర్లు ఉంటాయని సమాచారం. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబరు మొదటి వారంలో ఈ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. 


శాంసంగ్‌ (Samsung)
శాంసంగ్ ఆగస్టు నెలలో నాలుగు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. వాటిలో శాంసంగ్ జెడ్‌ ఫోల్డ్‌ 3, ఫ్లిప్ 3 5జీ మడత ఫోన్లతోపాటు శాంసంగ్‌ గెలాక్సీ ఎం52, గెలాక్సీ ఎఫ్52 మోడల్స్‌ ఉన్నాయట. గెలాక్సీ ఎం52 ధర సుమారు రూ. 25,000, ఎఫ్‌52 ప్రారంభ ధర రూ. 15,000 ఉంటుందని అంచనా.  ఇవేకాకుండా గెలాక్సీ ఏ12 పేరుతో మరో కొత్త మోడల్‌ను శాంసంగ్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.