ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను లాంచ్ చేసింది. అవే రూ.296, రూ.319 ప్లాన్లు. వీటిలో రూ.296 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా... రూ.319 ప్లాన్ వ్యాలిడిటీ పూర్తిగా ఒక నెల. జియో మనదేశంలో రూ.259 ప్లాన్‌ను లాంచ్ చేసిన అనంతరం ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను లాంచ్ చేయడం విశేషం. 30 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్ కనీసం ఒక్కటైనా అందుబాటులో ఉండాలని ట్రాయ్ టెలికాం ఆపరేటర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే.


ఎయిర్‌టెల్ రూ.296 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను ఈ ప్లాన్ ద్వారా పొందవచ్చు. ఇక డేటా లాభాల విషయానికి వస్తే... మొత్తంగా 25 జీబీ డేటాను ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. రోజువారీ పరిమితి లేదు.


ఎయిర్‌టెల్ రూ.319 ప్లాన్ లాభాలు
ఇక ఎయిర్‌టెల్ రూ.319 వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తున్నారు. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. ఈ 2 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.


ఈ రెండు ప్లాన్లతో 30 రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీ ట్రయల్ కూడా లభించనుంది. దీంతోపాటు అపోలో 24×7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. దీంతోపాటు వింక్ మ్యూజిక్‌కు ఉచిత యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్ కూడా లభించనున్నాయి.


గత వారం రిలయన్స్ జియో రూ.259 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. దీని వ్యాలిడిటీ ‘కాలెండర్’ నెలగా ఉంది. దీని ద్వారా రోజుకు 1.5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లభించనున్నాయి. వీటితో పాటు జియో యాప్స్‌కు యాక్సెస్ కూడా లభించనుంది.


ట్రాయ్ ఆదేశాల మేరకు వొడాఫోన్ ఐడియా కూడా రూ.327, రూ.337 ప్లాన్లను లాంచ్ చేసింది. వీటిలో రూ.327 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు కాగా, రూ.337 ప్లాన్ వ్యాలిడిటీ 31 రోజులుగా ఉంది. ఈ రెండు ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు. ఇక రూ.327 ప్లాన్ ద్వారా 25 జీబీ, రూ.337 ప్లాన్ ద్వారా 28 జీబీ డేటాను అందిస్తున్నారు. వీటితో పాటు వీఐ మూవీస్, టీవీ యాప్‌కు యాక్సెస్ లభించనుంది.


Also Read: యాపిల్ అత్యంత చవకైన 5జీ ఫోన్ వచ్చేసింది - లేటెస్ట్ ప్రాసెసర్‌తో - ధర ఎంతంటే?


Also Read: కొత్త ఐప్యాడ్ వచ్చేసింది - అన్నీ లేటెస్ట్ ఫీచర్లే - ధర ఎంతంటే?