భారతీయులకు అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డులలో ఆధార్ కార్డు కీలకమైనది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యకలాపాల కోసం ఆధార్ కార్డును కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఎవరైనా తమ ఆధార్ కార్డును పోగొట్టుకున్నట్లయితే, అది దుర్వినియోగం కాకుండా కార్డు వివరాలను లాక్ చేసుకునే వెసులుబాటు ఉంది. చెల్లుబాటు అయ్యే ఆధార్ ఉన్న ఏ వ్యక్తి అయినా ఈ సేవను పొందవచ్చు. మీ ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అందుబాటులో ఉంటే సరిపోతుంది. మీ మొబైల్ నంబర్ రిజిస్టర్ కానట్లయితే, సమీపంలోని ఎన్‌రోల్‌మెంట్ సెంటర్/మొబైల్ అప్‌డేట్ ఎండ్ పాయింట్‌ కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చు. బయోమెట్రిక్ వివరాల్లో ముఖ్యమైన వేలిముద్రలు, ఐరిష్ డేటా మిస్ యూజ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఎలాగో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం..


బయోమెట్రిక్ డేటాను ఎలా లాక్ చేయాలంటే?


*UIDAI యొక్క అధికారిక వెబ్‌సైట్‌(uidai.gov.in)ను ఓపెన్ చేయాలి.


*ఆ తర్వాత ఆధార్ సేవలపై క్లిక్ చేసి, లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్‌లను సెలెక్ట్ చేసుకోవాలి.


*మీ 12-అంకెల ఆధార్ నంబర్ లేదంటే 16-అంకెల వర్చువల్ IDని ఫిల్ చేయాలి.  


*సెండ్ OTP విత్ క్యాప్చా కోడ్‌పై క్లిక్ చేయండి.


*మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.


*OTPని ఎంటర్ చేయాలి.


*ఆ తర్వాత లాక్‌పై క్లిక్ చేస్తే మీ బయోమెట్రిక్ డేటా లాక్ అవుతుంది.


ఆధార్ పోగొట్టుకున్న వ్యక్తి బయో మెట్రిక్ వివరాలను లాక్ చేసిన తర్వాత, బయోమెట్రిక్ మోడ్ (ఫింగర్‌ప్రింట్/ఐరిస్)ని ఉపయోగించి ఏదైనా అథెంటికేషన్ సర్వీస్ ల కోసం UIDని ఉపయోగించినట్లయితే, బయోమెట్రిక్స్ లాక్ చేయబడిందని చూపిస్తుంది. నిర్దిష్ట ఎర్రర్ కోడ్  330 డిస్ ప్లే అవుతుంది. లాక్ చేయబడిన బయోమెట్రిక్స్ ఆధార్ హోల్డర్ అథెంటిఫికేషన్  కోసం వారి డేటాను (వేలిముద్రలు/ఐరిష్ ను) ఉపయోగించలేరని హెచ్చరిస్తుంది.


బయోమెట్రిక్ వివరాలు అన్ లాక్ కూడా చేసుకోవచ్చు!  


ఒక వ్యక్తి తన డేటాను లాక్  చేసిన తర్వాత, తాత్కాలికంగా అన్‌ లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పైన ఫాలో అయిన స్టెప్స్ ద్వారానే వెళ్లి లాకింగ్ సిస్టమ్ అన్ లాక్ చేసుకోవచ్చు. అలా చేసిన తర్వాత మళ్లీ బయోమెట్రిక్ ద్వారా అథెంటిఫికేషన్ పొందవచ్చు.


 ఆధార్ కార్డు ఉపయోగం ఏంటి?


ఆధార్ అనేది 12-అంకెల సంఖ్య. ఇది ప్రతి వ్యక్తికి సంబంధించిన యూనిక్ ఐడెంటిటీ   బయోమెట్రిక్ డేటాను కనెక్ట్ చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క బ్యాంక్ ఖాతా, ఫోన్ నంబర్, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర ఆర్థిక సేవలు అన్నీ వారి ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడి ఉంటాయి. అయితే, ఆధార్ విషయంలో దేశ అత్యున్నత న్యాయ స్థానం ఇప్పటికే పలుమార్లు కీలక తీర్పులను వెల్లడించింది. పౌరుల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని తెలిపింది. అంతేకాదు, ఆధార్ తప్పనిసరి కాదని తేల్చి చెప్పింది. అయినా, ప్రభుత్వాలు అన్ని సేవల కోసం ఆధార్ ను తప్పనిసరి చేశాయి.


Read Also: ఓటర్ ఐడీకి ఆధార్ నెంబర్ లింక్ చేయాలా? జస్ట్, ఇలా చేస్తే సరిపోతుంది