భారత్ లో 5జీ సేవలు ప్రారంభం
అధికారికంగా ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో ప్రారంభం
దేశంలో 13నగరాల్లో ప్రస్తుతానికి 5జీ సేవలు
రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీసేవలు ప్రారంభం
దశాబ్దం చివరి నాటికి 6జీ ఉండాలన్న మోదీ
6జీ తర్వాత చేతిలో ఫోన్ ఓ సూపర్ పవర్
సాంకేతిక విప్లవం అరచేతిలోనే అంటున్న నిపుణులు


భారత్‌లో 5G సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా ప్రారంభించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (IMC 2022) సదస్సులో పాల్గొన్న మోదీ... 5G సర్వీస్‌లను ఆవిష్కరించారు. మరో రెండేళ్లలో దేశవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా ఈ సర్వీస్‌లు అందించనున్నాయి. అంతే కాదు ఈ దశాబ్దం చివరికల్లా  భారత్ లో 6జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. 
ప్రతీ తరానికి సాంకేతికత మారుతూ వస్తోంది. దీన్ని కమ్యూనికేషన్ సేవలను G అంటే జనరేషన్స్ గా పిలుస్తారు. 1జీ నుంచి 5జీ వరకూ సాగిన ఈ ప్రస్థానాన్ని ఓ సారి చూద్దాం.


1G :
1970ల్లో జపాన్ లో 1G సేవలు ప్రారంభమయ్యాయి. మొబైల్ టెలికమ్యూనికేషన్స్ టెక్నాలజీల్లో ఇది ఓ విప్లవమైనా...కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే 1జీ పరిమితం. అది కూడా  సౌండ్ క్వాలిటీ తక్కువగా ఉండటం, తక్కువ ప్రాంతాలకే పరిమితం కావటం, రోమింగ్ సపోర్ట్ లేకపోవటం 1జీ సేవలు అప్ గ్రేడ్ చేయాలనే ఆలోచనలకు కారణాలు.


2G :
1991లో 2G సేవలు అందుబాటులోకి రావటం పెద్ద మార్పుల అని చెప్పొచ్చు.  సెకండ్ జనరేషన్ లో ఎనలాగ్ సిగ్నల్స్ కంప్లీట్ గా డిజిటల్ అయిపోయాయి. సీడీఎమ్ఏ, జీఎస్ఎం కాన్సెప్ట్ లు రావటంతో 50 కేబీపీఎస్ స్పీడ్ తో SMS, MMS లు పంపిచటం మొదలైంది. వాయిస్ కాల్స్ మీద దృష్టి ఉన్నప్పటికీ...డేటా సపోర్ట్ తో ఇంటర్నెట్ బ్రౌజ్ చేయటం లాంటి ఫీచర్లకు 2జీ లో కొంతమేర అవకాశం ఉండేది.  ప్రపంచదేశాల్లో చాలా చోట్ల 2జీ ని దాటేసి 3జీ వైపు వెళ్లినా భారత్ లో మాత్రం చాన్నాళ్లు 2జీ సేవలే కొనసాగాయి. ఇప్పటికీ కూడా ఇంకా 30 కోట్ల మంది వినియోగదారులు 2జీ సపోర్టెడ్ ఫోన్స్ వాడుతున్నట్లు అంచనా. అందుకే జియో లాంటి సంస్థలు '2జీ ముక్త్ భారత్' లాంటి నినాదాలతో ముందుకు వస్తున్నాయి.


3G విప్లవం :
 ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో 2001లోనే త్రీజీ సేవలు ప్రారంభమయ్యాయి. ఇది నిజంగా ఓ సాంకేతిక విప్లవానికి దారి తీసిందనే చెప్పాలి.  మొబైల్ ఇంటర్నెట్ ఫేజ్ ను త్రీజీ సర్వీసెస్ మార్చేశాయి. ఈమెయిల్స్, నావిగేషన్ మ్యాప్స్, వీడియో కాలింగ్, వెబ్ బ్రౌజింగ్, మ్యూజిక్ అనే యాడెడ్ అడ్వాటెంజ్ లతో మొబైల్ ఫోన్ ల స్థితి గతులను మార్చేసింది అంటే త్రీజీ అనే చెప్పాలి. 2009లో కానీ భారత్ లో 3జీసేవలు ప్రారంభం కాలేదు. త్రీజీ స్పెక్ట్రం ఆక్షన్ కూడా తీవ్ర వివాదాస్పదం అయ్యింది.


4G ప్రపంచం :
4జీ సేవలు 2010లో తొలిసారిగా కొన్ని దేశాల్లో ప్రారంభమయ్యాయి. హై స్పీడ్, హై క్వాలిటీ, హై కెపాసిటీ వాయిస్, డేటా సర్వీసులు అందించగలగటం 4జీ ప్రత్యేకత. ప్రస్తుతం భారత్ సహా అనేక దేశాల్లో ఎక్కువ మంది వినియోగదారులు వినియోగిస్తోంది 4జీ సేవలే. 3జీ సేవల కంటే 4జీ సేవలు 5నుంచి 7రెట్లు ఎక్కువ వేగంతో పనిచేస్తున్నాయి. ఫలితంగా మొబైల్ ఫోన్లు సంప్రదాయ పర్సనల్ కంప్యూటర్లను రీప్లేస్ చేశాయనే చెప్పాలి. భారత్ లో 2012 నుంచి 4జీ సేవలు ప్రారంభమయ్యాయి. మొదట కోల్ కతా లో ప్రారంభమై తర్వాత మిగిలిన నగరాలకు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా 4జీ సేవలు విస్తరించాయి.


5జీ సేవలు :
4జీ లో 50మిల్లీ సెకండ్లు పట్టే ఓ పనిని 5జీ 1 మిల్లీ సెకండ్ లో పూర్తి చేస్తుంది. అంత వేగంగా ఉంటాయి 5జీ సేవలు. ప్రధానంగా 5జీ సేవలతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(IOT) ద్వారా ప్రపంచవ్యాప్తంగా నెట్ వర్క్ ను మరింత బలోపేతం చేయటంతో పాటు...కమ్యూనికేషన్ ను మరో స్టేజ్ కు 5జీ సర్వీసెస్ తీసుకెళ్తాయని భావిస్తున్నారు. స్మార్ట్ సిటీ ఇన్ ఫ్రా స్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, రొబోటిక్ సర్జరీస్ లాంటి సేవల్లోనూ 5జీ రాకతో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. ఇప్పటికే సౌత్ కొరియా, యూఎస్, కెనడాల్లో 5జీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రాగా ఇప్పుడు భారత్ వంతు వచ్చింది.


ఫ్యూచర్ 'G' లు :
6జీ వరకూ అయితే మొబైల్ ఫోన్స్ కు సంబంధించిన వ్యవహారంలానే ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఆ తర్వాత వచ్చే జనరేషన్స్ మనిషి సౌకర్యాలను, జీవితాలను ఊహించని రీతిలో ప్రభావితం చేస్తాయని అంచనా వేస్తున్నారు. హోలో గ్రామ్ టెక్నాలజీస్, బీమ్ స్పోర్ట్స్, మెటావర్స్ లాంటి కాన్సెప్టులు మనిషి ఊహకు కూడా అందని ప్రపంచాన్ని ఆవిష్కృతం చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. 2028-2030 నాటికి 6జీ ప్రపంచాన్ని మానవాళి దాటేస్తుందనేది ఓ అంచనా.