ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోనున్నాడు. నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ అబుదాబీ వేదికగా ఐపీఎల్ 2021లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్ లో 200వ మ్యాచ్ కావడం విశేషం. అయితే ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ అరుదైన రికార్డు సాధించనున్నాడు.


ఐపీఎల్ లో ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారుతూ ఉంటారు. కానీ కొందరు ఆటగాళ్లు ఒకే జట్టుకు ఆడినా లీగ్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్ లు ఆడలేదు. నేటి మ్యాచ్ ద్వారా కోహ్లీ ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. కోహ్లీ 2008లో ఆర్సీబీ తరఫున ఐపీఎల్ లో అరంగేట్రం చేశాడు. 199 మ్యాచ్ లలో 191 ఇన్నింగ్స్ లాడిన కోహ్లీ 37.97 సగటుతో 6,076 పరుగులు చేశాడు. ఇందులో 5 శతకాలు, 40 అర్ధ శతకాలు సైతం ున్నాయి. ఆర్సీబీ జట్టు 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్‌కు చేరినా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది. 


Also Read: విరాట్ కోహ్లీ మరో కీలక నిర్ణయం.. ఆర్సీబీ కెప్టెన్సీకి గుడ్ బై.. ఇదే చివరి సీజన్






టీమిండియా కెప్టెన్‌గా అపూర్వ విజయాలు అందించిన విరాట్ కోహ్లీ ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మరికొన్ని రోజుల్లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ తరువాత టీ20 లలో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. ఐపీఎల్ ఫేజ్ 2 మొదలైన రోజే మరో సంచలన నిర్ణయంతో అభిమానులకు షాకిచ్చాడు. ఆర్సీబీ సారథ్య బాధ్యతల నుంచి సైతం వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆర్సీబీ ఫ్రాంచైజీకి తన నిర్ణయాన్ని తెలిపానని వీడియో రూపంలో సందేశాన్ని ఇచ్చాడు. 


Also Read: దేశవాళీ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్.. ఇక భారీగా జీతాలు


టీ20 ఫార్మాట్లో 10 వేల పరుగులు..
విరాట్ కోహ్లీ మరో 71 పరుగులు చేస్తే టీ20 ఫార్మాట్లో 10,000 మార్క్ చేరుకున్న తొలి భారత క్రికెటర్ కానున్నాడు. నేటి మ్యాచ్ ద్వారా కోహ్లీ ఒకే ఫ్రాంచైజీ తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా నిలవనుండగా.. ఈ జాబితాలో ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. సీఎస్కేకు ధోనీ 182 మ్యాచ్‌లు, సురేష్ రైనా 172 మ్యాచ్‌లు (సీఎస్కే) ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహించారు.