ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా యువ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, స్టార్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ అదరగొట్టారు. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లతో రాణించిన మహ్మద్ సిరాజ్ 465 రేటింగ్ పాయింట్లతో  ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి దూసుకొచ్చాడు.






మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక వరుసగా రెండు టెస్టుల్లో విఫలమైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధసెంచరీతో రాణించిన రోహిత్‌ శర్మ 6వ ర్యాంకులోనే సరిపెట్టుకున్నాడు. కెరీర్ బెస్ట్ 773 రేటింగ్ పాయింట్లను మాత్రం రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు.






ప్రస్తుతం రోహిత్ - కోహ్లీ మధ్య కేవలం మూడు రేటింగ్ పాయింట్లే తేడా ఉంది. రోహిత్‌ తర్వాతి స్థానంలో 736 పాయింట్లతో రిషబ్‌ పంత్‌ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దూసుకురాగా, కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో, స్టీవ్‌ స్మిత్‌(891) మూడో స్థానానికి, మార్నస్ లబుషేన్(878) నాలుగో స్థానానికి పడిపోయారు. 






ఇక టెస్ట్‌ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే... పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా రవిచంద్రన్ అశ్విన్(848) సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. లార్డ్స్ టెస్ట్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టిన ఆండర్సన్‌ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని ఆరో స్థానానికి ఎగబాకగా, గాయంతో సిరీస్‌కు దూరమైన ఇంగ్లండ్‌ పేసర్‌ స్టువర్ట్ బ్రాడ్ 8వ స్థానంలో, టీమిండియా పేసు గుర్రం బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి 10వ స్థానంలో నిలిచారు. ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. విండీస్‌ ఆటగాడు జేసన్ హోల్డర్ టాప్‌లో కొనసాగుతున్నాడు.