Virat Kohli Becomes 1st Cricketer to Reach 200 Million Followers on Instagram : టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) మరో అరుదైన రికార్డు సృష్టించాడు. కాకపోతే ఈ సారి చేసింది క్రికెట్‌ మైదానంలో కాదు! సోషల్‌ మీడియాలో!! ఇన్‌స్టాగ్రామ్‌లో 200 మిలియన్‌ ఫాలోవర్ల మైలురాయి అందుకున్న తొలి భారతీయుడిగా ఘనత అందుకున్నాడు.


ప్రపంచంలోని అత్యుత్తమ క్రీడాకారుల్లో విరాట్‌ కోహ్లీ ఒకడు. ఎప్పట్నుంచో అతడికి మంచి ఫాలోయింగ్‌ ఉంది. అటు టీమ్‌ఇండియా ఇటు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్సీని వదిలేసినా అనుసరించే వారి సంఖ్య మరింత పెరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో సోషల్‌ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఒకేఒక్కడు విరాట్‌. అందరు  క్రీడాకారులను తీసుకుంటే లయనల్‌ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డొ అతడికన్నా ముందున్నారు.




ఇన్‌స్టాలో ఫాలోవర్ల సంఖ్య 200 మిలియన్లు దాటడంతో విరాట్‌ కోహ్లీ కృతజ్ఞతలు తెలియజేశాడు. '200 మిలియన్లు శక్తిమంతం అయ్యా! నా ఇన్‌స్టా ఫ్యామిలీ ఇస్తున్న మద్దతుకు ధన్యవాదాలు' అని అతడు పోస్టు చేశాడు.


ప్రస్తుతం విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు టీ20ల సిరీసుకు దూరంగా ఉన్నాడు. కొన్నేళ్లుగా ఎడతెరపి లేకుండా క్రికెట్‌ ఆడుతుండటంతో సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారు. పనిభారం వల్ల అతడు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్‌ 2022లోనూ తన స్థాయికి తగినట్టు పరుగులు చేయలేదు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిపి సెంచరీ చేయక రెండున్నరేళ్లు దాటింది. అయినప్పటికీ అభిమానులకు అతడికి అండగా నిలుస్తున్నారు.