Vinod Kambli: కుటుంబ పోషణ భారంగా మారిందని, బీసీసీఐ ఇస్తున్న రూ. 30 వేల పింఛన్‌తోనే తాను నెట్టుకొస్తున్నానంటూ టీమ్‌ ఇండియా మాజీ ఆటగాడు వినోద్‌ కాంబ్లీ చేసిన ప్రకటన క్రీడాలోకాన్ని ఆశ్చర్యపరిచింది. ఏదైనా పని కల్పించాల్సిందిగా ముంబయి క్రికెట్ సంఘాన్ని అనేక సార్లు కోరినట్లు కాంబ్లి వెల్లడించాడు. ఒకప్పుడు సచిన్‌తో సమానంగా ఆట, రికార్డులు, టీవీ యాడ్‌లతో క్రేజ్‌ సంపాదించుకున్న కాంబ్లీకి ఇలాంటి దుస్థితి రావడం వెనుక పెద్ద కథే ఉంది. 


రికార్డుల ప్రభంజనం


క్రికెట్లోకి కాంబ్లీ ప్రవేశమే ఓ పెద్ద సంచలనం. సచిన్‌తో కలిసి ఒకే స్కూల్లో చదువుకొని, ఒకే గురువు వద్దే క్రికెట్‌ శిక్షణ పొందిన కాంబ్లీ... స్కూల్ క్రికెట్లోనే రికార్డుల మోత మోగించాడు. సచిన్‌తో కలిసి అతడు సృష్టించిన 664 పరుగుల భాగస్వామ్యం ప్రపంచ క్రికెట్లోనే ఓ అపూర్వ రికార్డుగా నిలిచిపోయింది. అందులో కాంబ్లి స్కోరు 349. చాలామందికి తెలీని విషయం ఏంటంటే అదే మ్యాచ్‌లో కాంబ్లి బంతితో 6వికెట్లు సైతం తీశాడు. తర్వాత తొలి బంతికే సిక్సర్ బాది రంజీ ట్రోఫీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే వరుసగా రెండు ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీలు చేయడం అప్పట్లో పెద్ద సంచలనం. ఈ క్రమంలోనే భారత్‌ తరపున అత్యంత వేగంగా 14 ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగులు పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. తర్వాత ఎంతమంది స్టార్లు పుట్టుకొచ్చినా ఆ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. 


ఒకప్పటి సూపర్‌స్టార్


1993లో కాంబ్లి బ్యాటింగ్ సగటు 113 కాగా సచిన్‌ ఆ దరిదాపుల్లో కూడా లేడు. కెరీర్‌లో కేవలం 17 టెస్టుమ్యాచ్‌లే ఆడిన కాంబ్లి సగటు 54.20. సచిన్, గావస్కర్, ద్రావిడ్ సగటు కంటే ఇది ఎక్కువ. దిగ్గజ బౌలర్ షేన్‌వార్న్‌ బౌలింగ్‌లో ఆ రోజుల్లోనే ఒకే ఓవర్‌లో 22 పరుగులు బాదిన దృశ్యం క్రికెట్‌ అభిమానులకు ఇప్పటికీ గుర్తే. వినోద్ కాంబ్లి తన తొలి 58 ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. ఇండియన్‌ క్రికెట్‌లో ఇంత రాకెట్ స్పీడ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన వారు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలోనే సచిన్‌తో పాటే కాంబ్లి సూపర్ స్టార్‌గా ఎదిగాడు. 


ఫోకస్ తప్పాడు


ఓ నిర్భాగ్య మెకానిక్‌ కొడుకుగా పేదరికంలో పుట్టి, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కాంబ్లి అంచనాలను అందుకోలేక క్రికెట్ కెరీర్‌ నుంచి అర్ధంతరంగా నిష్క్రమించడం ఓ విషాదం. ఒక్కసారిగా వచ్చిపడిన స్టార్‌డమ్‌తో కాంబ్లి ఫోకస్ పక్కదారి పట్టింది. ఆటపై శ్రద్ధ తగ్గించి జల్సాలకు ఎక్కువగా అలవాటు అయ్యాడు. ఇదే టైమ్‌లో సచిన్ మాత్రం ఆటపై నుంచి తన దృష్టి మరలకుండా జాగ్రత్త పడ్డాడు. ఎంతో కమిట్‌మెంట్‌తో కెరీర్‌పై ఫోకస్‌ చేశాడు. స్కూల్‌ దశ నుంచి సచిన్‌తో సమానంగా ఎదుగుతూ వచ్చిన కాంబ్లీ.. ఒక దశ తర్వాత సచిన్‌ కంటే వెనుకబడ్డాడు. సచిన్‌ మాత్రం క్రికెటే ప్రపంచంగా ముందుగా సాగాడు. ప్రపంచ క్రికెట్‌లో సచిన్‌ దిగ్గజంగా మారడానికి.. కాంబ్లీ ఒక మెరుపుతీగలా మెరిసి మాయమైపోయేందుకు తేడా కేవలం కమిట్‌మెంట్‌. సచిన్‌ క్రికెట్‌ పట్ల ఎంతో అంకితభావంతో ఉంటూ దూసుకెళ్తుంటే.. వినోద్‌ కాంబ్లీ మాత్రం తన స్టార్‌డమ్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆటను నిర్లక్ష్యం చేశాడు. పైగా తాగుడుకు బానిసయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి జెడ్‌స్పీడ్‌తో దూసుకొచ్చి కాంబ్లీ.. కెరీర్‌ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. 1993లో టెస్టు కెరీర్‌ మొదలుపెట్టిన కాంబ్లీ 1995లోనే టెస్టులకు దూరమయ్యాడు. 


వ్యవహార శైలే కారణమా?


తన క్రీడాజీవితం నాశనం అవడానికి కెప్టెన్, సహచరులు, క్రికెట్‌ బోర్డు కారణమని కాంబ్లీ నమ్ముతుంటాడు. రాజకీయాలు, పక్షపాత వైఖరి కారణంగానే తనకు జాతీయ జట్టులో చోటురాకుండా పోయిందని ఆరోపిస్తుంటాడు. అయితే క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. కాంబ్లీ వ్యవహార శైలే అతడి క్రీడాజీవితానికి ముగింపు పలికిందనేది వారి విశ్లేషణ.


బ్యాటింగ్‌లో బయటపడిన లోపాలు


అంతర్జాతీయ క్రికెట్‌కు అనుగుణంగా కాంబ్లీ తన ఆట తీరును మార్చుకోలేదు. 1994 ‌లో కొట్నీ వాల్ష్ వేసిన బౌన్సర్లను అతడు ఎదుర్కోలేకపోయాడు. బౌన్సర్లను ఎదుర్కోవడం కాంబ్లీకి విప్పలేని పజిల్‌గా మారింది. 'కాంబ్లీకి ఏం చేయాలో తెలియలేదు. అప్పటి వరకు అతడి టాలెంటే అతడి అన్ని సమస్యలను పరిష్కరిస్తూ వచ్చింది' అని క్రికెట్ విశ్లేషకుడు హర్ష భోగ్లే చెప్పారు. 'వేగవంతమైన బంతులను ఎదుర్కొనేటప్పుడు కాంబ్లీ భుజాలను లేపేవాడు. కనీసం అలాంటి బంతులను కట్ చేయడానికి కూడా ప్రయత్నించలేదు. ఇలాంటివే టెస్టు క్రికెట్‌లో అతడు చోటు దక్కించుకోకుండా చేశాయి.' అని భోగ్లే పేర్కొన్నారు.


"అవసరమైనప్పుడు సచిన్ ఆదుకోలేదు"


1995‌లో కాంబ్లీ తన చివరి అంతర్జాతీయ వన్డే ఆడాడు. అప్పటికే 9 సార్లు జాతీయ జట్టుకు వస్తూ, పోతూ ఉన్నాడు. కానీ, సచిన్‌లా జట్టులో సుస్థిర స్థానం సంపాదించలేకపోయాడు. 2009‌లో ఓ రియాలిటీ షోలో కాంబ్లీ మాట్లాడుతూ, 'టీం ఇండియాలో వివక్ష ఉంది. కష్టకాలంలో సచిన్ నాకు సహాయం చేయలేదు' అని చెప్పాడు. ఈ షోలో పాల్గొన్నందుకు కాంబ్లీకి రూ. 10 లక్షలు వచ్చాయని వార్తలొచ్చాయి. ఈ కార్యక్రమం తర్వాత కాంబ్లీ వివరణ ఇస్తూ.. 'నాకు అవసరం వచ్చినప్పుడు అతను సహాయం చేయలేదు. అదే రియాలిటీ షోలో చెప్పాను' అని పేర్కొన్నాడు.


బాల్య స్నేహితుల మధ్య పెరిగిన దూరం


అప్పటి నుంచి సచిన్, కాంబ్లీల మధ్య దూరం పెరిగింది. 2013‌లో సచిన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పినప్పుడు చేసిన ప్రసంగంలో కాంబ్లీ పేరును కూడా ప్రస్తావించలేదు. తమ స్నేహం చెదిరిపోవడంపై అందరూ వ్యాఖ్యానించడం కాంబ్లీని కూడా ఆశ్చర్యపరిచింది. 'ఆ రోజు సచిన్ నా పేరు ప్రస్తావించకపోవడం చాలా బాధించింది. చాలా మంది పేర్లను ఆ రోజు సచిన్ ప్రస్తావించాడు. కానీ, స్కూల్ డేస్‌లో మేం చేసిన వరల్డ్ రికార్డు గురించి చెప్పనే లేదు. ఆ ఇన్నింగ్స్ తర్వాతే ప్రపంచం మమ్మల్ని గుర్తించింది. ''మరో బాధాకర విషయం ఏంటంటే సచిన్ తన వీడ్కోలు పార్టీకి చాలా మంది సహచరులను కుటుంబంతో సహా ఆహ్వానించాడు. నన్ను మాత్రం పిలువలేదు. దానికి నా మనసు గాయపడింది. నేను సచిన్ జీవితంలోనే కాదు వాళ్ల ఇంట్లోనూ భాగం. మంచి చెడులెన్నింటినో కలిసి అనుభవించాం. అతను ఇప్పుడు నన్ను మరిచిపోయి ఉంటాడని అనుకుంటున్నా' అని కాంబ్లీ చెప్పాడు.


మా ఇద్దరి మధ్య అదే తేడా 


కాంబ్లీ వ్యాఖ్యలపై సచిన్ ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. అయితే, 2014 ‌లో ఆంగ్ల దినపత్రిక టెలిగ్రాఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ, 'నాకు, కాంబ్లీకి ఒక విషయంలో చాలా వైరుధ్యముంది. మా ఇద్దరి జీవనశైలి వేర్వేరు' అని చెప్పాడు. 'నేను టాలెంట్‌ గురించి మాట్లాడటం లేదు. అతని జీవన విధానం వేరు. నా తీరు వేరు. మేం వేర్వేరు నేపథ్యాల నుంచి వచ్చాం. భిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నేను ఒకలా, తను మరోలా వాటిని ఎదుర్కొన్నాడు. మా ఇంట్లో వాళ్ల దృష్టి ఎప్పుడూ నామీదే ఉండేది. అందుకే నా కాళ్లెప్పుడు భూమ్మీదే ఉండేవి.' అని చెప్పాడు.