ఈ ఏడాది జ‌రిగే ప్యారిస్ ఒలింపిక్స్ పాల్గొనాలనే లక్ష్యంతో ఉన్న టీమిండియా మహిళల హాకీ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 నుంచి జరగనున్న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ టోర్నీకి... జట్టు వైస్‌ కెప్టెన్‌ వంద‌న కటారియా దూర‌మైంది. చెంప‌ల భాగంలోని ఎముక విర‌గ‌డంతో టోర్నీ నుంచి త‌ప్పుకుంటున్నట్లు వందన ప్రకటించింది. ఆమె స్థానాన్ని బ‌ల్జీత్ కౌర్‌ భ‌ర్తీ చేయ‌నుంది. వంద‌న టోర్నీకి దూరం కావ‌డం దుర‌దృష్టక‌రమని.. ప్రాక్టీస్ సెష‌న్‌లో ఆమె చెంప ఎముక విరిగిందని చీఫ్‌ కోచ్‌ స్కాప్‌మెన్‌ తెలిపారు. ఫార్వర్డ్ ప్లేయ‌ర్ అయిన వందన జ‌ట్టులో లేక‌పోవ‌డం భారత్‌కు పెద్ద లోటుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాంచీ వేదిక‌గా జ‌న‌వ‌రి 13 న ఒలింపిక్ క్వాలిఫ‌య‌ర్ మొద‌ల‌వ్వనుంది. గ్రూప్ బిలో ఉన్న టీమిండియా టోర్నీ ప్రారంభం రోజే అమెరికాతో త‌ల‌ప‌డ‌నుంది. అనంత‌రం భారత మహిళల హాకీ జట్టు జ‌న‌వ‌రి 14న న్యూజిలాండ్‌తో, 16వ తేదీన ఇట‌లీని ఢీ కొట్టనుంది. ఈ టోర్నీలో ఫైన‌ల్‌కు చేరితే భార‌త్‌కు ఒలింపిక్ పెర్త్ ద‌క్కనుంది.

 

మహిళా హాకీ జట్టు కెప్టెన్‌గా రజినీ

అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) ‘హాకీ ఫైవ్స్‌’ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత మహిళల జట్టుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యతిమరపు రజని కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సీనియర్‌ గోల్‌కీపర్‌ అయిన రజని భారత మహిళా జట్టులో కీలక ప్లేయర్‌గా మారింది. గోల్‌కీపర్‌ రజని భారత్‌కు 96 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. 2009లో అరంగేట్రం చేసిన తనకు ఒలింపిక్స్‌, వరల్డ్‌కప్‌, ఆసియా గేమ్స్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. అలాగే 2016 ఆసియా చాంపియన్‌షిప్స్‌, 2017 మహిళల హాకీ ఆసియాక్‌పలో స్వర్ణం సాధించిన భారత జట్టులో సభ్యురాలు. భారత మహిళల జుట్టుకు మహిమా చౌదరి (వైస్‌ కెప్టెన్‌), బన్సారి సోలంకి, అక్షత అబాసో, జ్యోతి ఛెత్రి, మరియానా కుజుర్‌, ముంతాజ్‌ఖాన్‌, అజ్మినా కుజుర్‌, రుతుజ పిసల్‌, దీపిక సోరెంగ్‌ ఎంపికయ్యారు. నమీబియా, పోలెండ్‌, అమెరికాతో కలిసి భారత జట్టు గ్రూపు-సిలో ఉంది.

 

పురుషుల జట్టుకు సిమ్రన్‌జీత్‌ సింగ్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని హాకీ ఇండియా ప్రకటించింది. పురుషుల జట్టులో మన్‌దీప్‌ మోర్‌ (వైస్‌ కెప్టెన్‌), సూరజ్‌ కార్కేరా, ప్రశాంత్‌కుమార్‌ చౌహాన్‌, మన్‌జీత్‌, మహ్మద్‌ రహీల్‌ మౌసీన్‌, మణిందర్‌ సింగ్‌, పవన్‌ రాజ్‌భర్‌, గుర్‌జోత్‌ సింగ్‌, ఉత్తమ్‌ సింగ్‌ స్థానం సంపాదించారు. గ్రూపు-బిలో భారత్‌, ఈజిప్ట్‌, జమైకా, స్విట్జర్లాండ్‌ ఉన్నాయి. ఒమన్‌లోని మస్కట్‌లో ఈనెల 24 నుంచి 27 వరకు మహిళలు, 28 నుంచి 31 వరకు పురుషుల టోర్నీలు జరుగుతాయి.

 

ఏమిటీ.. హాకీ ఫైవ్స్‌

టీ20 క్రికెట్‌ తరహాలోనే హాకీ ఫైవ్స్‌ అనేది సూపర్‌ ఫాస్ట్‌గా ముగిసే మ్యాచ్‌. కేవలం 20 (10+10) నిమిషాలపాటు మాత్రమే ఆట సాగుతుంది. మధ్యలో రెండు నిమిషాల విరామం ఉంటుంది. అలాగే రెగ్యులర్‌ హాకీ మ్యాచ్‌లా 11 మంది కాకుండా ఇందులో గోల్‌కీపర్‌తో కలిపి మొత్తం ఐదుగురు మాత్రమే ఆడుతారు.నలుగురు సబ్‌స్టిట్యూట్స్‌లను అనుమతిస్తారు. విస్తీర్ణం కూడా రెగ్యులర్‌ కోర్టులో సగం మాత్రమే ఉంటుంది. ‘డీ’ సర్కిల్‌ కూడా కనిపించదు. దీంతో మైదానంలో ఎక్కడి నుంచైనా ప్లేయర్‌ గోల్‌ చేయవచ్చు. తొలిసారిగా 2014 యూత్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో అడుగిడిన ఈ క్రీడ, ఇప్పుడు 60 దేశాల్లో ప్రాచుర్యం పొందింది.