టీమిండియా యువ ఆటగాళ్లు సూర్యకుమార్‌​ యాదవ్‌, పృథ్వీ షాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కెర్లు కొడుతోంది. మంచి కామెడీ టైమింగ్‌తో వారు అదరగొట్టారు. ఇంగ్లండ్‌ సిరీస్‌కు ఎంపికైన వీరిద్దరూ శ్రీలంక నుంచి ఇక్కడికి వచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆవేశ్‌ ఖాన్‌లు గాయాల బారిన పడటంతో వారు స్వదేశానికి వెళ్లిపోయారు.






వారి స్థానంలో సూర్యకుమార్‌, పృథ్వీ షాలను ఎంపిక చేశారు.  శ్రీలంక పర్యటన ముగించుకొని నేరుగా ఇంగ్లండ్‌కు వచ్చిన వీరిద్దరు క్వారంటైన్‌కు వెళ్లిపోయారు. ఇటీవలే క్వారంటైన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న సూర్య, పృథ్వీలు జట్టుతో కలిశారు. లార్డ్స్‌ టెస్టులో ఘన విజయం అందుకున్న టీమిండియాతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.


ఐదు టెస్టు మ్యాచ్‌ల కోసం ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 25 నుంచి మొదలుకానుంది. తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టెస్టుకు సూర్యకుమార్‌, పృథ్వీ షా కూడా అందుబాటులో ఉన్నారు. 



వీరిద్దరూ ఓ మిమిక్రీ వీడియో చేశారు. ఆ వీడియోను సూర్య కుమార్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. 
బాజీగర్‌ సినిమాలోని జానీ లీవర్‌, దినేష్‌ హింగూల క్యారెక్టర్లను ఇమిటేట్‌ చేసిన  సూర్య, పృథ్వీలు మంచి కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. సూర్య తన చేతిలో కాఫీ కప్‌ పట్టుకొని ఉండగా... అతని వెనుకాల పృథ్వీ షా కూర్చొని ఉన్నాడు. సూర్య చేతిలో పట్టుకున్న కప్పును పృథ్వీకి చూపిస్తూ వెటకారంగా నవ్వాడు. దీనికి పృథ్వీ కూడా అలాగే చేశాడు.


 ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  ఈ వీడియో చూసిన అభిమానులు సూర్యకుమార్‌, పృథ్వీ షాలది మంచి కామెడీ టైమింగ్ అని కామెంట్లు పెడుతున్నారు.