Smriti Mandhana Women T20 World Cup 2023: మహిళల టీ20 ప్రపంచ కప్ 2023 ప్రారంభమైంది. టీమ్ ఇండియా తొలి మ్యాచ్ పాకిస్థాన్ తో ఆదివారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వేలి గాయం కారణంగా టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంథన జట్టుకు దూరమైంది.


స్మృతి మంథన గాయపడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం తను పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడలేదు. ఇది టీమ్ ఇండియాకు పెద్ద నష్టం అని చెప్పాలి. అయితే స్మృతి మంథన గాయానికి సంబంధించిన అధికారిక సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.


వేలికి గాయం కావడంతో స్మృతి మంథన ఇబ్బంది పడుతోంది. ఈ కారణంగానే ఆమె పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు దూరమైంది. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం మంథన వేలికి ఎలాంటి ఫ్రాక్చర్ లేదని రిషికేశ్ కనిట్కర్ చెప్పారు. ఇది కొంచెం ఉపశమనం కలిగించే అంశం. కాబట్టి రెండో మ్యాచ్‌కు స్మృతి మంథన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో జరగనుంది. ఈ మ్యాచ్ ఆదివారం నాడు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేప్ టౌన్ వేదికగా వెస్టిండీస్‌తో టీమిండియా రెండో మ్యాచ్ ఆడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో భారత్‌ మూడో మ్యాచ్‌‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ ఫిబ్రవరి 18వ తేదీన జరగనుంది.


అదే సమయంలో భారత జట్టు ఫిబ్రవరి 20వ తేదీన ఐర్లాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. టోర్నమెంట్‌లోని మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ ఫిబ్రవరి 23వ తేదీన కేప్‌టౌన్‌లో జరగనుండగా, ఫిబ్రవరి 24వ తేదీన రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


మరోవైపు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం (WPL వేలం) కూడా ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. ప్రతి జట్టుకు వేలంలో రూ.12 కోట్ల పర్స్ అందుబాటులో ఉండనుంది. తమ జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయగలవు. ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం కూడా స్మృతి మంథనకే ఉంది.


భారత క్రికెటర్ స్మృతి మంథన గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన ప్లేయర్. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చాలా సందర్భాలలో జట్టును గెలిపించింది. ప్రస్తుతం ఆమె మహిళా బ్యాట్స్‌మెన్‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానంలో ఉంది. స్మృతి మంథన మంచి పాపులర్ ఫేస్. కాబట్టి ఆమె చేరబోయే టీమ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో WPL వేలంలో స్మృతి మంథన అత్యంత ఖరీదైన ప్లేయర్లలో నిలిచే అవకాశం ఉంది. మొత్తం అందరికంటే కాస్ట్లీ ప్లేయర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.