భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 210 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో కీగన్ పీటర్సన్ (72: 166 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా ఐదు వికెట్లు తీయగా.. ఉమేష్ యాదవ్, షమీలు చెరో రెండు వికెట్లు తీశారు. శార్దూల్ ఠాకూర్‌కు ఒక వికెట్ దక్కింది.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 223 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో దక్షిణాఫ్రికా మొదటిరోజే బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. నాలుగో ఓవర్లోనే ఫాంలో ఉన్న డీన్ ఎల్గర్‌ను (3: 14 బంతుల్లో) బుమ్రా అవుట్ చేశాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సరికి దక్షిణాఫ్రికా వికెట్ నష్టానికి 17 పరుగులు చేసింది.


రెండో రోజు ఆట ప్రారంభం అయిన రెండో బంతికే ఎయిడెన్ మార్క్రమ్‌ను (8: 22 బంతుల్లో, ఒక ఫోర్) బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ (25: 45 బంతుల్లో, నాలుగు ఫోర్లు), కీగన్ పీటర్సన్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో కేశవ్ మహరాజ్‌ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.







ఈ సమయంలో కీగన్ పీటర్సన్, వాన్ డర్ డసెన్ (21: 54 బంతుల్లో) భారత బౌలర్లను నిలువరించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 67 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. లంచ్ నుంచి రాగానే వాన్ డర్ డసెన్‌ను బుమ్రా అవుట్ చేశాడు. ఆ తర్వాత కీగన్ పీటర్సన్‌కు ఫాంలో ఉన్న టెంపా బవుమా (28: 52 బంతుల్లో) జత కలిశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 47 పరుగులు జోడించాక.. ఈ భాగస్వామ్యాన్ని మహ్మద్ షమీ విడదీశాడు. షమీ వేసిన అవుట్ స్వింగర్‌ను ఆడబోయి బవుమా స్లిప్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. ఇదే ఓవర్లో కైల్ వెర్నేన్‌ (0: 2 బంతుల్లో) కూడా అవుట్ అయ్యాడు.


ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కో జాన్సెన్ (7: 26 బంతుల్లో) కూడా క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేదు. టీ బ్రేక్‌కు ముందు చివరి ఓవర్లో బుమ్రా బౌలింగ్‌లో జాన్సెన్ అవుట్ అయ్యాడు. టీ నుంచి రాగానే మళ్లీ బుమ్రానే దక్షిణాఫ్రికాను దెబ్బ కొట్టాడు. క్రీజులో పాతుకుపోయిన కీగన్ పీటర్సన్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత రబడను (15: 25 బంతుల్లో, ఒక ఫోర్) లార్డ్ శార్దూల్ ఠాకూర్, ఎంగిడిని (3: 17 బంతుల్లో) బుమ్రా అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది.