Lakshya Sen storms into All England semi-final after beating former champion Lee: ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌(All England Badminton Championship)లో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్(Lakshya Sen) సెమీస్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ 20-22, 21-16, 21-19 తేడాతో సింగపూర్ షట్లర్ లీ జి జియా‌పై విజయం సాధించాడు. తొలి గేమ్‌ ఓడినా స్ఫూర్తిదాయక ఆటతీరుతో దూసుకెళ్లిన లక్ష్యసేన్‌.. మిగిలిన గేమ్‌లు గెలిచి సెమీస్‌ చేరాడు. గంటా 11 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లో లక్ష్యసేన్‌... జియా లీపై అద్భుత విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లు ప్రతీ గేమ్‌ హోరాహోరీగానే సాగింది. కానీ లక్ష్య ఒత్తిడిలో గొప్పగా ఆడి వరుసగా రెండు గేమ్‌లతో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌, చిరాగ్‌శెట్టి తమ పోరాటాన్ని ముగించారు.  జరిగిన పురుషుల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ ద్వయం 16-21, 15-21తో మహమ్మద్‌ షోహిబుల్‌, బాగాస్‌ మౌలానా జోడీ చేతిలో ఓటమిపాలైంది. తొలి గేమ్‌ ఆరంభం నుంచే ఇరు జోడీలు హోరాహోరీగా తలపడడంతో ఆధిక్యం చేతులు మారుతూ సాగింది. 16-19 స్కోరు వద్ద తప్పిదాలు చేసిన సాత్విక్‌ జోడీ తొలి గేమ్‌ను చేజార్చుకొంది. ఇక, రెండో గేమ్‌లోనూ భారత జంట తడబడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఇండోనేసియా జోడీ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో జంట 21-11, 11-21, 11-21తో చైనాకు చెందిన జాంగ్‌ షు జియాన్‌-జంగ్‌ యు చేతిలో పరాజయం పాలైంది. 


అన్నీ ప్రతికూల ఫలితాలే
ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఛాంపియన్‌షిప్‌( All England Open Badminton Championships ) లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్‌(Lakshy Sen) తప్ప మిగిలిన షట్లర్లు అందరూ ఇంటి దారి పట్టారు. రెండో రౌండ్లోనే ఒలింపిక్‌ పతక విజేత, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు(PV Sindhu) పరాజయం పాలైంది. మహిళల సింగిల్స్‌లో సింధు 19-21, 11-21తో టాప్‌సీడ్‌, ప్రపంచ ఛాంపియన్‌, కొరియాకు చెందిన అన్‌ సె యంగ్‌ చేతిలో వరుస గేముల్లో ఓడింది . అనవసర తప్పిదాలతో సింధు ఆట గాడి తప్పింది. కొరియా షట్లర్‌ అన్‌ సి యంగ్‌తో 42 నిమిషాలపాటు సాగిన పోరులో సింధు అటాకింగ్‌ గేమ్‌ ఆడే ప్రయత్నంలో పదేపదే తప్పులు చేయగా.. ప్రత్యర్థి మాత్రం విభిన్న గేమ్‌తో సింధును ఇబ్బందిపెట్టింది. యంగ్‌ చేతిలో ఒక్క మ్యాచ్‌ కూడా నెగ్గని సింధుకు ఇది వరుసగా ఏడో పరాజయం. తొలి గేమ్‌లో సింధు 16-17తో గట్టిపోటీ ఇచ్చేలా కనిపించింది. సింధు మూడు గేమ్‌పాయింట్లు కాచుకున్నా.. యంగ్‌ను అడ్డుకోలేక పోయింది. ఇక, రెండో గేమ్‌లో కొరియన్‌ ఆధిపత్యం ముందు సింధు ఏమాత్రం నిలబడలేక పోయింది.