టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ పతకం పై ఆశలు రేపింది. మహిళల డిస్కస్ త్రో ఈవెంట్లో భారత క్రీడాకారిణి కమల్‌ప్రీత్ కౌర్ ఫైనల్‌కి అర్హత సాధించి రికార్డు నెలకొల్పింది. శనివారం ఉదయం ఫైనల్ కోసం నిర్వహించిన క్వాలిఫికేషన్ రౌండ్లో అద్భుత ప్రదర్శన చేసిన కమల్‌ప్రీత్‌ కౌర్‌ రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఆమె ఫైనల్‌కు అర్హత సాధించింది. 


మరోవైపు భారీ అంచనాలతో అడుగుపెట్టిన మరో త్రోయర్ సీమా పూనియా 16వ స్థానంలో నిలిచి నిరాశగా వెనుదిరిగింది. ఇక అమెరికా క్రీడాకారిణి వలరీ అల్మన్‌ 66.42 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచింది. కమల్‌ప్రీత్‌ 64 మీటర్లతో రెండో స్థానం సంపాదించింది.


కాగా, ఫైనల్‌ పోటీ ఆగస్టు 2న ఉదయం 5.30గంటలకు ప్రారంభంకానుంది. అక్కడ మొత్తం 12 మంది పోటీపడనున్నారు. కమల్‌ప్రీత్‌ ఫైనల్లోనూ ఇలాంటి మెరుగైన ప్రదర్శన చేస్తే భారత్‌కు మరో పతకం ఖాయమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో కమల్‌ప్రీత్‌ తొలి ప్రయత్నంలో 60.29 మీటర్లు, రెండో ప్రయత్నంలో 63.97 మీటర్లు డిస్కస్‌ త్రో చేసింది. చివరికి మూడోసారి 64 మీటర్లు సాధించి నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. 


ఫైనల్‌కు అర్హత సాధించాలంటే క్రీడాకారిణులు 64మీటర్లు డిస్కస్ త్రో చేయాలి. ఎవరైతే 64 మీటర్లు సాధిస్తారో వారు నేరుగా ఫైనల్లో చోటు సంపాదించినట్లే. లేదంటే అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్‌ 12 మందిని ఫైనల్‌కు ఎంపిక చేస్తారు. ఇక 16వ స్థానంలో నిలిచి ఇంటిముఖం పట్టిన పూనియా 60.57 మీటర్లే డిస్కస్‌ త్రో చేయగలిగింది.


కమల్‌ప్రీత్‌ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉంది. ఇప్పటికే ఆమె రెండుసార్లు 65 మీటర్లను చేరుకొని జాతీయ అత్యుత్తమ రికార్డు నెలకొల్పింది. మార్చిలో నిర్వహించిన ఫెడరేషన్‌ కప్‌లో ఆమె 65.06 మీట్ల దూరం విసిరి భారత్‌ తరఫున మెరుగైన ప్రదర్శన చేసింది. అలాగే జూన్‌లో జరిగిన ఇండియన్‌ గ్రాండ్‌ ప్రి-4 ఈవెంట్‌లో తన రికార్డును తనే బద్దలుకొట్టింది.


నెదర్‌లాండ్స్‌ క్రీడాకారిణి జోరిండ్‌ వాన్‌ క్లింకెన్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో విఫలమైంది. ఆమె 61.15 మీటర్లతోనే సరిపెట్టుకొని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. అమెరికా క్రీడాకారిణి అల్మన్‌ తొలి స్థానంలో నిలిచింది. రియో , లండన్ ఒలింపిక్స్ బంగారు పతక విజేత, క్రొయేషియాకు చెందిన సాండ్రా పెర్కోవిక్ 63.75 మీటర్లు విసిరింది.


దీంతో రెండుసార్లు ఒలింపిక్ ఛాంపియన్ ఒలింపిక్ ఛాంపియన్ సాండ్రా పెర్కోవిక్ బెస్ట్ కంటే కమల్‌ప్రీత్ దే అత్యుతమ త్రో గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లో అడుగు పెట్టింది కమల్ ప్రీత్. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన 25 ఏళ్ల కమల్‌ప్రీత్ కౌర్ టోక్యో ఒలంపిక్స్ మైదానంలో అద్భుతం సృష్టించింది.