Womens Premier League Auction: భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ను విజయవంతంగా నిర్వహించిన బీసీసీఐ(BCCI) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL)పై దృష్టి సారించింది. ఇప్పటికే పురుషుల ఐపీఎల్‌ నిర్వహణ కోసం ఏర్పాట్లు ముమ్మరం చేసిన బీసీసీఐ ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ WPLపైనా దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌ 2024 వేలానికి సంబంధించిన తేదీని ప్రకటించింది. ముంబయి(Mumbai) వేదికగా డిసెంబర్‌ 9న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలం ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చిలో ఈ లీగ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.  ఈసారి బెంగళూరు, ముంబై వేదికగా ఉమెన్స్ ప్రీమియర్‌ లీగ్‌

నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. ఈసారి ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూను కూడా పెంచి బీసీసీఐ శుభవార్త చెప్పింది. గతేడాది రూ. 12 కోట్లుగా ఉన్న ఒక్కో ఫ్రాంచైజీ పర్స్‌ వాల్యూను ఈ ఏడాది రూ. 13.5 కోట్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.5 కోట్లు అధికం.

 

డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే తాము రిటైన్‌, రిలీజ్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. ఐదు ఫ్రాంచైజీలు గత సీజన్‌లో తమతో ఆడిన 60 మంది క్రికెటర్లను రిటైన్‌ చేసుకుని 29 మంది విడుదల చేశాయి. రిటైన్ చేసుకున్నవారిలో 21 మంది విదేశీ క్రికెటర్లున్నారు. వేలం నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ జట్టు 11 మంది ప్లేయర్లను రిలీజ్ చేసింది. దిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత మంది ప్లేయర్లను విడుదల చేసింది. అలా ఐదు టీమ్‌లు మొత్తం 29 మంది క్రికెటర్లను రిలీజ్‌ చేశాయి. ప్రస్తుతం ఐదు ఫ్రాంచైజీలు 30 మంది ఆటగాళ్లను దక్కించుకునేందుకు రూ.71.65 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఈ 30 మంది ఆటగాళ్లలో 9 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

 

ఐదు ఫ్రాంచైజీల వద్ద ఉన్న పర్స్‌ వాల్యూ

 

ఢిల్లీ క్యాపిటల్స్‌ – రూ. 2.25 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –3

గుజరాత్‌ జెయింట్స్‌ – రూ. 5.95 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –10

ముంబై ఇండియన్స్‌ రూ. 2.1 కోట్లు అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –05

రాయల్‌ ఛాలెంజర్స్‌      రూ. 3.35 కోట్లు అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –07

యూపీ వారియర్స్‌ – రూ. 4 కోట్లు, అందుబాటులో ఉన్న స్లాట్స్‌ –05

 

గతేడాది జరిగిన WPL వేలంలో భారత మహిళ క్రికెటర్ స్మృతి మంధాన కళ్లు చెదిరే ధరకు ఎంపికైంది. ఆమెను రూ. 3.40 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- జట్టులోకి తీసుకుంది. WPL తొలి సీజన్‌లో అత్యధిక ధరకు అమ్ముడైన తొలి మహిళా క్రికెటర్‌గా మంధాన రికార్డు సృష్టించింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఆష్లీ గార్డనర్‌ రూ. 3.20 కోట్లకు గుజరాత్ జెయింట్స్, స్కివర్‌ను రూ. 3.20 కోట్లకు ముంబయి ఇండియన్స్ కొనుగోలు చేశాయి. ఇక భారత ప్లేయర్లు దీప్తి శర్మ (రూ. 2.60 కోట్లు - యూపీ వారియర్స్), జెమీమా రోడ్రిగ్స్ (రూ. 2.20 కోట్లు - దిల్లీ క్యాపిటల్స్) అత్యధిక ధర పలికిన జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన ముంబై ఇండియన్స్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి టైటిల్‌ కైవసం చేసుకుంది. చివరి ఓవర్‌ వరకు హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై సగర్వంగా ట్రోఫీ అందుకుంది. మొదట బౌలింగ్‌లో మాథ్యూస్‌, వాంగ్‌ ఢిల్లీ పనిపట్టగా.. బ్యాటింగ్‌లో స్కీవర్‌తో పాటు హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ చెలరేగింది.