Virat Kohli returns to India from London gears up for IPL 2024: ఐపీఎల్(IPL) 17వ ఎడిషన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. దీనికి ఇంకా మూడు రోజులు కూడా  సమయం లేదు. మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), చెన్నై సూపర్ కింగ్స్‌(CSK) మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రన్‌ మెషీన్‌, స్టార్ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ వచ్చేశాడు. ఐపీఎల్‌ 2024లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాడు. ముంబైవిమానాశ్రయంలో విరాట్ కనిపించారు. గత రెండు నెలలుగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్న విరాట్‌... తొలి మ్యాచ్‌ ఆడేందుకు స్వదేశానికి వచ్చాడు. కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిక్షణ శిబిరంలో చేరనున్నాడు. కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు కోహ్లి విరామం తీసుకున్నట్లు తర్వాత స్పష్టమైంది. కోహ్లి, అనుష్క దంపతులకు ఇప్పటికే ఓ కూతురున్న సంగతి తెలిసిందే. విరాట్‌ సతీమణి అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు అకాయ్‌ అనే పేరును పెట్టినట్లు విరాట్‌, అనుష్కశర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్‌ వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. 


ధోనీతోనే తొలి యుద్ధం


తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)... కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని... కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని... కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని.... ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 


పాక్ క్రికెటర్‌ ఏమన్నాడంటే..? 
కోహ్లీని టీ 20 ప్రపంచకప్‌నకు ఎంపిక చేయకపోతే అంతకన్నా పిచ్చి నిర్ణయం ఇంకోటి ఉండదని పాక్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ ఇర్పాన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. విరాట్‌ను తీసుకోవద్దని చెప్పేవారంతా గల్లీ క్రికెట్‌ ఆడిన వారేనని కూడా విమర్శించాడు. ఇటీవల భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ విధ్వంసాన్ని చూడలేదా అని నిలదీశాడు. భారత్‌కు కొన్ని మ్యాచుల్లో విరాట్‌ ఒంటిచేత్తో విజయాలు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. కోహ్లీని వచ్చే టీ20 ప్రపంచ కప్‌లోనూ జట్టులోకి తీసుకోవాలని.. భారత జట్టుకు కోహ్లీ అతిపెద్ద ఆస్తి అని ఇర్ఫాన్‌ అన్నాడు. కోహ్లీ ఉంటే మానసికంగా భారత్‌ పైచేయి సాధిస్తుందని కూడా అన్నాడు. విమర్శలు చేసేవారంతా గత ప్రపంచ కప్‌ను గమనించాలని కూడా ఇర్ఫాన్‌ వెల్లడించాడు. కోహ్లీ లేకపోతే భారత్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌ లీగ్‌ స్టేజ్‌లోనే కనీసం 4 మ్యాచ్‌ల వరకు ఓడిపోయేదిన్నాడు . వన్డే ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 765 పరుగులు చేశాడు. . తృటిలో వ‌ర‌ల్డ్‌క‌ప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అంద‌రికి గుర్తే. 765 ప‌రుగులు సాధించి లీడింగ్ ర‌న్‌స్కోర‌ర్ గా రికార్డ్ సాధించాడు. దాద‌పు 95 యావ‌రేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచ‌రీలు, 6 హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కాడు.