Mitchell Starc excited about his return to IPL circus: ఐపీఎల్(IPL) చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్(Mitchell Starc) నిలిచాడు. కోల్ కతా నైట్ రైడర్స్( Kolkata Knight Riders) ఫ్రాంచైజీ ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను రికార్డు ధరకు కొనుగోలు చేసింది. గుజరాత్ టైటాన్స్, కేకేఆర్ స్టార్క్ కోసం పోటాపోటీగా వేలంలో పాల్గొన్నాయి. చివరికి మిచెల్ స్టార్క్ కోసం రూ.24.75 కోట్లు వెచ్చించి వేలంలో స్టార్ పేసర్ ను కళ్లు చెదిరే ధరకు కేకేఆర్ సొంతం చేసుకుంది. అయితే ఈ వేలం మాత్రం ఎంతో మంది భారత ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. ఐపీఎల్‌కు సమయం సమీపిస్తున్న వేళ మిచెల్‌ స్టార్క్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ను సర్కస్  గా అభివర్ణించాడు.


స్టార్క్‌ ఏమన్నాడంటే..
ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ ఓ సర్కస్‌ లాంటిదని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్‌ వినోదాన్నందిస్తుందనే ఉద్దేశంతో అతడు ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌ లీగ్‌ పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్నానని.. ప్రపంచంలో అత్యుత్తమ టీ20 లీగ్‌ అయిన ఐపీఎల్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నానని స్టార్క్‌ వెల్లడించాడు. ఇది సర్కస్‌ లాంటి వినోదాన్నందిస్తుందని తెలిపాడు. స్టార్క్‌ 2014, 2015 సీజన్లలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు.ఆ తర్వాత ఏడేళ్లు ఐపీఎల్‌లో ఆడలేదు. ఐపీఎల్‌లోకి మళ్లీ పునరాగమనం చేయడంపై స్టార్క్‌ ఆనందం వ్యక్తం చేశాడు. 2018లోనే కోల్‌కత్తాకు ఆడాల్సి ఉందని కానీ అప్పుడు కుదరలేదని... ఇప్పుడు తిరిగి ఆ జట్టులోకి వచ్చానని స్టార్క్‌ తెలిపాడు. ఇప్పుడు కొత్త బృందంలో అడుగు పెడుతున్ననని... అంతర్జాతీయ క్రికెట్లో తలపడ్డ కొందరితో కలిసి ఆడబోతుండడం ఉత్సాహాన్నిస్తోందని స్టార్క్‌ తెలిపాడు.



వేదిక మార్పు తప్పదా...? 
  ఐపీఎల్‌ రెండో దశ వేదిక మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తొలి దశ మ్యాచ్‌లు అన్నీ భారత్‌లోనే జరగనుండగా... రెండో దశ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌ వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ, ఐపీఎల్‌ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన జారీ కాలేదు. ఇప్పటికే ఆటగాళ్ల పాస్‌పోర్టులను ఫ్రాంచైజీలు తీసుకుంటున్నాయని సమాచారం. పాస్‌పోర్టు కాలపరిమితికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్‌ వర్గాలు వెల్లడించాయి. కానీ భారత్ వేదికగానే అన్ని మ్యాచ్‌లు జరుగుతాయని ఐపీఎల్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ మాత్రం గతంలోనే స్పష్టం చేశారు. మరి ఇప్పుడు ఎన్నికల తేదీలను ప్రకటించనున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. దుబాయ్‌ వేదికగా మ్యాచ్‌లను నిర్వహిస్తే బాగుంటుందనేది కొందరి అభిప్రాయమని.... ఇప్పటికే కొన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల పాస్‌పోర్ట్‌లను సేకరిస్తున్నాయని బీసీసీఐ(BCCI) వర్గాలు తెలిపాయి. చెన్నై సూపర్ కింగ్స్ యువ పేసర్ మతీశా పతిరణ గాయం కారణంగా దాదాపు నాలుగైదు వారాలపాటు మైదానానికి దూరం కానున్నాడు. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లకు పతిరణ అందుబాటులో ఉండటం కష్టమేనని చెన్నై స్పష్టం చేసింది. ఇప్పుడు గాయం తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటంతో మరికొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.