Ind Vs Eng Test Series: వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు చిన్న వివాదం జరిగింది. మ్యాచ్ వేదికైన లండన్ లోని లార్డ్స్ మైదానం లోకి ఆస్ట్రేలియా ప్లేయర్ల ఎంట్రీకి పర్మిషన్ దొరకలేదని తెలుస్తోంది. ఈనెల 11 నుంచి ఆసీస్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఫైనల్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఆసీస్ వరుసగా రెండో ఫైనల్ ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో ఆ జట్టే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. అయితే లార్డ్స్ మైదానంలో ప్రాక్టీస్ చేసుకునేందుకు ఆసీస్ జట్టుకు తొలుత పర్మిషన్ లభించకపోగా, ఆ తర్వాత ఆదివారం నుంచి ఆ జట్టు ప్రాక్టీస్ కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే ఆసీస్ జట్టు ప్రాక్టీస్ చేయకపోవడానికి, టీమిండియాకు మధ్య సంబంధం ఉన్నట్ల తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ కు టీమిండియా చేరుకుంది. ఈనెల 20 నుంచి హెడీంగ్లీలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగుతుంది. అయితే ప్రస్తుతం భారత జట్టు లార్డ్స్ లో ప్రాక్టీస్ చేయడంతో ఈ తకరారు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ తర్వాత లైన్ క్లియర్ కావడంతో ఆసీస్ జట్టు ప్రాక్టీస్ కు వెళ్లింది. ఇక ఫైనల్ కు సంబంధించి ప్రిపరేషన్లను ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ పంచుకున్నాడు. నిజానికి యాషెస్ సిరీస్ సందర్బంగా ఇక్కడ ఆడినప్పుడు తమకు చాలా నెగిటివ్ స్వాగతం లభించిందని, ఈసారి డబ్ల్యూటీసీ చాంపియన్షిప్ లో అభిమానులు తమకు అనుకూలంగా మద్దతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పేస్ దళాన్ని లీడ్ చేస్తున్న కమిన్స్..ఆసీస్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలతోపాటు పేస్ బౌలింగ్ దళాన్ని కూడా కమిన్స్ నడిపిస్తున్నాడు. జోష్ హేజిల్ వుడ్, మిషెల్ స్టార్క్ తోపాటు నేథన్ లయోన్ లను బౌలింగ్ భారాన్ని పంచుకుంటున్నారు. ఇక కామెరాన్ గ్రీన్ కూడా నాలుగో పేసర్ గా బరిలోకి దిగుతాడు. మరోవైపు టీమిండియా లార్డ్స్ లో ప్రాక్టీస్ చేయడం వెనక మిస్టరీ అంతుబట్టడం లేదు. ఐదు టెస్టుల సిరీస్ లో నాలుగో మ్యాచ్ లో ఈ వేదికపై జరుగుతుంది. అది కూడా జూలై నెలలో ఉండటం విశేషం. అయితే ఇప్పటికిప్పడు టీమిండియా ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఏంటని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ 2025-27 రేసును ఈ టూర్ తో భారత్ ప్రారంభించనుంది. ఈ సిరీస్ ను గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. ఈ నెలలోనే ఈ రెండు జట్ల మధ్య అయిదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ స్టార్ కాబోతోంది. అయితే ఈ సిరీస్ కు పటౌడీ ట్రోఫీ స్థానంలో సచిన్, అండర్సన్ పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. జూన్ 11 న లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఈ ఇద్దరు దిగ్గజాలు కొత్త జెర్సీని ఆవిష్కరించనున్నారు. అయితే ఇరు జట్ల మధ్య జరిగే ఈ టోర్నీ పేరు మార్పుపై భారత దిగ్గజలు అన్ హేపీ గా ఫీల్ అవతున్నారు.