క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ శనివారం ప్రారంభం అయింది. అయితే మొదటి మూడు మ్యాచ్‌ల్లో వచ్చిన ఫలితాలు మాత్రం అభిమానులను షాక్‌కు గురి చేశాయి. టోర్నీలో బలమైన జట్లు అయిన చెన్నై, ముంబై, బెంగళూరు జట్లు తమ మొదటి మ్యాచ్‌ల్లో ఓడిపోయి పాయింట్ల పట్టికలో చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.


ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ఛేదన చేసిన జట్లే విజయం సాధించాయి. మొదటి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్లతో చెన్నైపై, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగు వికెట్లతో ముంబైపై, మూడో మ్యాచ్‌లో పంజాబ్ ఐదు వికెట్లతో బెంగళూరుపై విజయం సాధించాయి.


కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ధోని (50 నాటౌట్) మినహా ఎవరూ 30 పరుగులు కూడా చేయలేకపోవడంతో చెన్నై 20 ఓవర్లలో 131 పరుగులకే పరిమితం అయింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. రెండో మ్యాచ్ జరిగిన విధానం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. బలంగా ఉన్న ఢిల్లీ టాపార్డర్‌ను అవుట్ చేసినా ఆఖర్లో లలిత్ యాదవ్, అక్షర్ పటేల్ కలిసి జట్టును గెలిపించారు.


బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 206 పరుగుల భారీ లక్ష్యాన్ని సైతం పంజాబ్ ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. దీన్ని బట్టి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంటే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటే సగం మ్యాచ్ గెలిచినట్లే అన్నమాట. గతేడాది యూఏఈలో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్యే ఐపీఎల్ జరిగింది.


ఐపీఎల్‌లో నేడు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. లక్నో సూపర్ జెయింట్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్ కాగా... గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు.


Also Read: PBKS Vs RCB: కెప్టెన్ మారినా కలిసిరాలేదు - పంజాబ్‌పై ఆరు వికెట్లతో బెంగళూరు ఓటమి!


Also Read: Tilak Varma in IPL: అసలెవరీ తిలక్ వర్మ - ముంబై తరఫున అరంగేట్రం - మొదటి మ్యాచ్‌లోనే మెరుపులు!