Sunrisers Hyderabad vs Punjab Kings: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మొదటి గెలుపు లభించింది. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 143 పరుగులు సాధించింది. అనంతరం సన్‌రైజర్స్ హైదరాబాద్ 17.1 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 48 బంతుల్లో, 10 ఫోర్లు, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పంజాబ్ బ్యాటర్లలో  శిఖర్ ధావన్ (99 నాటౌట్: 66 బంతుల్లో, 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఇది తొలి విజయం. పంజాబ్ కింగ్స్‌కు కూడా ఇదే తొలి ఓటమి.


144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రూ.13 కోట్లకు పైగా చెల్లించిన కొనుగోలు చేసిన హ్యారీ బ్రూక్ 13 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో సన్‌రైజర్స్ 27 పరుగుల వద్ద మొదటి వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా కాసేపటికే వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 45 పరుగులు మాత్రమే. అయితే రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించి సన్‌రైజర్స్‌కు తొలి విజయాన్ని అందించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.


కనీసం 100 పరుగులు సాధిస్తుందా అనే స్థాయి నుంచి కెప్టెన్, ఓపెనర్ శిఖర్ ధావన్ (99 నాటౌట్: 66 బంతుల్లో, 12 ఫోర్లు, ఐదు సిక్సర్లు) పోరాటంతో ఈ స్కోరును సాధించింది. చివరి వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడిస్తే అందులో మోహిత్ రాథీ (1 నాటౌట్: 2 బంతుల్లో) కొట్టింది ఒకటి మాత్రమే. పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్, శామ్ కరన్ (22: 15 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) మినహా మరెవరూ కనీసం ఆరు పరుగులు కూడా చేయలేకపోయారు.


టాస్ గెలిచిన సన్‌రైజర్స్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి బంతి నుంచే పంజాబ్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను (0: 1 బంతి) భువీ మొదటి బంతికే పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ షార్ట్ (1: 3 బంతుల్లో), జితేష్ శర్మ (4: 9 బంతుల్లో) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శిఖర్ ధావన్‌కు శామ్ కరన్ జతకలిశాడు. వీరు నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించి వికెట్ల పతనానికి కాసేపు అడ్డుకట్ట వేశారు. ఈ దశలో శామ్ కరన్‌ను అవుట్ చేసి మయాంక్ మార్కండే ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.


ఆ తర్వాత వచ్చిన వారిలో ఎవరూ క్రీజులో నిలబడలేదు. దీంతో పంజాబ్ 88 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయింది. ఇక లాభం లేదనుకున్న శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను పూర్తిగా తన చేతుల్లోకి తీసేసుకున్నాడు. అజేయమైన పదో వికెట్‌కు వీరు 55 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్, మార్కో జాన్సెన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. భువీ ఒక వికెట్ పడగొట్టాడు.