Sanju Samson In IPL: రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శామ్సన్ ఐపీఎల్ హిస్టరీ పెద్ద రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌గా సంజు నిలిచాడు. ఆదివారం (ఏప్రిల్ 16వ తేదీ) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శామ్సన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. అతను 187.50 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తూ 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ సిక్సర్లతో ఐపీఎల్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సార్లు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్ జాబితాలో సంజు చేరాడు.


ఐపీఎల్‌లోని మొత్తం ఆరు ఇన్నింగ్స్‌ల్లో సంజు శామ్సన్ ఇప్పటి వరకు ఆరు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ దగ్గరికి సంజు చేరుకున్నాడు. జోస్ బట్లర్ ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్‌ క్రిస్‌ గేల్‌ నంబర్‌ వన్‌. ఐపీఎల్‌లో మొత్తం 22 ఇన్నింగ్స్‌ల్లో గేల్ ఆరు లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు కొట్టాడు.


ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ఒక ఇన్నింగ్స్‌లో ఆరు కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు
క్రిస్ గేల్ - 22 సార్లు.
ఏబీ డివిలియర్స్ - 11 సార్లు.
ఆండ్రీ రస్సెల్ - 9 సార్లు.
షేన్ వాట్సన్ - 7 సార్లు.
జోస్ బట్లర్ - 6 సార్లు.
సంజు శామ్సన్ - 6 సార్లు.


ఐపీఎల్‌లో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాజస్తాన్ రాయల్స్ మూడు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 19.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ తరఫున సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించాడు.


గుజరాత్ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ (46: 30 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ (45: 34 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. రాజస్తాన్ రాయల్స్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు.


179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌కు ఆరంభంలోనే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (1: 7 బంతుల్లో), జోస్ బట్లర్ (0: 5 బంతుల్లో) ఇద్దరూ విఫలం అయ్యారు. స్కోరు బోర్డుపై నాలుగు పరుగులు చేరే సరికి వీరిద్దరూ పెవిలియన్ బాట పట్టారు. అయితే వన్‌డౌన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ (26: 25 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు), సంజు శామ్సన్ (60: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుట పరిచారు. వీరు మూడో వికెట్‌కు 42 పరుగులు జోడించారు.


ఆ తర్వాత వచ్చిన రియాన్ పరాగ్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. దీంతో రాజస్తాన్ 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సంజు శామ్సన్,  షిమ్రన్ హెట్‌మేయర్ (56 నాటౌట్: 26 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు)కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరు ఐదో వికెట్‌కు కేవలం 27 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. అనంతరం షిమ్రన్ హెట్‌మేయర్ ఎలాంటి పొరపాటు జరగకుండా మ్యాచ్‌ను ముగించాడు.