ఆవేశ్​ ఖాన్​ అద్భుత బౌలింగ్​తో రాజస్థాన్​ రాయల్స్​పై 2 పరుగుల తేడాతో గెలిచి లక్నో సూపర్​ జెయింట్స్​ ఊపిరిపీల్చుకుంది. కానీ ఆ జట్టును ఓ భయం వెంటాడుతూనే ఉంది. అదే కెప్టెన్​ రిషభ్​ పంత్​ పేలవ ఫామ్​. ఐపీఎల్​ చరిత్రలోనే రికార్డు ధర (రూ.27 కోట్లు) పలికిన పంత్ ప్రదర్శన దారుణంగా ఉంది. శనివారం రాజస్థాన్​తో జరిగిన పోరులోనూ ఘోరంగా  విఫలమయ్యాడు. ఓపెనర్లిద్దరూ స్వల్ప స్కోర్లకే ఔటైపోయి టీమ్​ కష్టాల్లో ఉన్నప్పుడు ఆచితూచి ఆడాల్సిన కెప్టెన్​ మరోసారి ఓ చెత్త షాట్​ ఆడి కీపర్​కు క్యాచ్​ ఇచ్చి వెనుదిరిగాడు. 

జైపూర్​లోని సవాయ్​ మాన్ సింగ్​ స్టేడియంలో శనివారం రాజస్థాన్​ రాయల్స్​తో లక్నో సూపర్​ జెయింట్స్ తలపడింది. టాస్​ గెలిచిన లక్నో మొదట బ్యాటింగ్​ ఎంచుకోగా మార్​క్రమ్​తోపాటు ఓపెనర్​గా వచ్చిన మిచెల్​ మార్ష్​ కేవలం 4 రన్స్​ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వన్​డౌన్​లో వచ్చిన పూరన్​ సైతం ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు. 11 పరుగులు చేసి సందీప్​ శర్మ బౌలింగ్​లో ఎల్బీగా ఔటయ్యాడు. 

వెనువెంటనే రెండు కీలక వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న వేళ క్రీజులోకి వచ్చిన రిషభ్​ పంత్​.. ఆచిత​ కెప్టెన్​ ఇన్నింగ్స్​ ఆడాల్సింది పోయి తన పేలవ ఫామ్​ను కొనసాగించాడు. 9 బంతులు ఎదుర్కొని కేవలం 3 పరుగులే చేశాడు. హసరంగ బౌలింగ్​లో ఓ చెత్త షాట్​ ఆడి కీపర్​ ధ్రువ్​ జురెల్​ చేతికి చిక్కి పెవిలియన్​ చేరాడు.

ఈ ఐపీఎల్​ సీజన్​లో 8 మ్యాచ్​లు ఆడిన పంత్​.. 7 మ్యాచ్​ల్లో బ్యాటింగ్​ చేసి కేవలం 108 రన్స్​ మాత్రమే చేశాడు. ఆడిన మొత్తం మ్యాచ్​లలో కేవలం ఒకే ఒక్క దాంట్లో రాణించాడు. ఏప్రిల్​ 14న చెన్నై సూపర్​ కింగ్స్​పై 63 రన్స్​ చేశాడు. ఇక అన్ని మ్యాచ్​లలో దారుణంగా విఫలమయ్యాడు. లక్నో దిల్లీతో తలపడగా 6 బాల్స్​ ఆడి డకౌట్​ అవగా.. హైదరాబాద్​పై 15, పంజాబ్​పై 2, ముంబైపై 2, గుజరాత్​పై 21 చేశాడు. 98.14 స్ట్రైక్​రేట్​తో పంత్​ యావరేజ్​ స్కోరు 15 మాత్రమే.

పంత్​ రాణించాల్సిందే..LSG తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 22న వారి సొంత మైదానమైన ఎకానా స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. 8 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, 3 ఓటములతో ఉన్న లక్నో 10 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. టాప్​ ఆర్డర్​లో విచెల్​ మార్ష్​, మార్​క్రమ్​, నికొలస్​ పూరన్​ రాణిస్తుండడంతో ఆ జట్టు మిడిలార్డర్​పై పెద్దగా ప్రభావం పడడం లేదు. కానీ వారు విఫలమైతే మిడిలార్డర్ లో ఉన్న పంత్​​ రాణించాల్సి ఉంటుంది. ప్లేఆఫ్ రేసులో జట్టు కొనసాగాలంటే.. పంత్ తన ఫామ్‌ను పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూపర్​ విజయంరాజస్థాన్​తో జరిగిన ఉత్కంఠ పోరులో లక్నో​ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట లక్నో బ్యాటింగ్​ చేయగా.. మార్​క్రమ్​ (66), ఆయుశ్​ బదోని (50) రాణించారు. చివర్లో అబ్దుల్​ సమద్​ చెలరేగి 10 బంతుల్లో 30 రన్స్​ చేయడంతో ఆ జట్టు 180 లక్ష్యాన్ని రాజస్థాన్​ ముందుంచింది. ఆ తర్వాత బ్యాంటింగ్​కు దిగిన రాయల్స్​ ఓపెనర్లు యశస్వి జైస్వాల్​ (74), 14 ఏళ్ల కుర్రాడు వైభవ్​ సూర్వవంశీ (34) దంచికొట్టడంతో సునాయాసంగా గెలుస్తుందనుకున్న రాజస్థాన్​ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్​లో ఆ జట్టు విజయానికి 9 రన్స్​ అవసరముండగా ఆవేశ్​ ఖాన్​ అద్భుతంగా బౌలింగ్​ చేసి కేవలం 6 రన్స్​ మాత్రమే ఇచ్చాడు. దీంతో రాయల్స్​ జట్టు 2 రన్స్​ తేడాతో ఓడింది.