Comments on Royal Challengers Bengaluru : ఈ ఐపీఎల్‌(IPL) బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌(SRH) సునామీల విరుచుకుపడడంతో.. బెంగళూరు(RCB) మరోసారి పరాజయం పాలైంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఒకే మ్యాచులో గెలిచి... ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత బెంగళూరుపై విమర్శల జడివాన కురుస్తోంది.


మహేష్‌ భూపతి ఏమన్నాడంటే..?
అభిమానులు, ఆటగాళ్ల కోసమైనా బెంగళూరును బీసీసీఐ కొత్త యజమానికి విక్రయించాలని టెన్నిస్‌ స్టార్‌ హేశ్ భూపతి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశాడు. ఇతర జట్ల వలే స్పోర్ట్స్‌ ఫ్రాంచైజీని నిర్మించడానికి శ్రద్ధ వహించే యజమానికి అవకాశం ఇవ్వాలని కూడా సూచించాడు. సచిన్‌ టెండూల్కర్‌ కూడా ఈ మ్యాచ్‌పై స్పందించాడు. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌, ఆర్సీబీ పవర్‌ హిట్టింగ్‌తో అద్భుతమైన ఆటతీరు కనబర్చాయని అన్నాడు. 40 ఓవర్లలో 549 పరుగులు వచ్చాయని కానీ దీన్ని ఏ బౌలర్‌ కోరుకోడని అన్నాడు.


సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసిన తర్వాత ఆర్సీబీ బౌలర్లపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. చివరకు విరాట్ కోహ్లి సైతం ఈ బౌలింగ్‌ చూసి నిస్సహాయంగా బాధపడటం తప్పించి ఏమీ చేయలేకపోయాడని అంటున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ఆర్సీబీ టీమ్ మొత్తాన్ని ట్రోల్ చేస్తున్నారు.


ఛేదనలో ఇదే హయ్యస్ట్‌ స్కోరు


ఈ మ్యాచ్‌లో ఓడినా బెంగళూరు ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83, ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఛేజింగ్‌లో 250 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది.


ప్లే ఆఫ్‌కు కూడా మంగళం.. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించటం అంత సుళువు కాదు. తొలి 7 మ్యాచ్‌ల్లో బెంగళూరు కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించింది. బెంగళూరుకు ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, ఫాఫ్ డు ప్లెసిస్ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోయే 7 మ్యాచ్‌లన్నింటినీ గెలిస్తే అప్పుడు ఆ జట్టు 16 పాయింట్లతో ఉంటుంది. ఈ 16 పాయింట్లు ప్లే ఆఫ్‌కు చేరేందుకు బెంగళూరుకు సరిపోవు. ఒకవేళ అన్ని మ్యాచుల్లో గెలిచినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు ప్లే ఆఫ్‌కు చేరాలన్నా అది బెంగళూరు చేతుల్లో లేదు. ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌పై గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఆడనుంది. మార్చి 21న ఈడెన్ గార్డెన్స్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి.