IPL 2025 MI VS LSG Updates: లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన మ్యాచ్ లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలోకి దిగలేదు. నెట్ ప్రాక్టీస్ లో మోకాలికి గాయం కావడంతో తను బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే డగౌట్ లో ఉండి, ఎప్పటికప్పుడు మ్యాచ్ ను అంచనా వేస్తూ, ముంబై టీమ్ కు రోహిత్ సూచనలిచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విధ్వంసక ప్లేయర్ నికోలస్ పూరన్ ఔట్ వెనకాల రోహిత్ హస్తం ఉందని తెలుస్తోంది.
నిజానికి టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నోకు శుభారంభం దక్కింది. 76 పరుగులను ఓపెనర్లు జోడించారు. మిషెల్ మార్ష్ (60), ఐడెన్ మార్క్రమ్ (53) ఫిఫ్టీలతో ఆకట్టుకున్నారు. అయితే మార్ష్ ఔటయ్యాక విధ్వంసక ప్లేయర్ పూరన్ బ్యాటింగ్ కు వచ్చాడు. సూపర్ ఫామ్ లో ఉన్న పూరన్ ఆరు బంతుల్లోనే 12 పరుగులు చేశాడు. అయితే అతనిలోని బలహీనతను కనిపెట్టిన రోహిత్.. పేసర్ కమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఒక మెసెజీ పంపాడు. దీంతో పూరన్ వికెట్ పడిపోయింది.
ఆ వ్యూహంతో..
ఈ సీజన్ లో పూరన్ భీకర ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటివరకు 75, 70, 44 పరుగులతో ఆరెంజ్ క్యాప్ ను కూడా తన సొంతం చేసుకున్నాడు. ఇక ముంబైతోనూ సూపర్ టచ్ లో కన్పించిన పూరన్ ను స్లో బౌన్సర్ తో హార్దిక్ బోల్తా కొట్టించాడు. అతనికి అలా బౌలింగ్ చేయాలని రోహితే సూచించినట్లు కామెంటేటర్ సబా కరీం తెలిపాడు. పూరన్ వికెట్ పడిన తర్వాత ఉద్వేగంతో రోహిత్ ప్రవర్తించిన విధానంపై కరీం మాట్లాడాడు. ఇక ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై 12 పరుగులతో ఓడిపోయింది. ఇక మ్యాచ్ లో రోహిత్ ఇన్వాల్వ్ మెంట్ పై నెటిజన్లు ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.
త్వరలోనే జట్టులోకి బుమ్రా, రోహిత్..
గాయాలతో ఇబ్బంది పడుతున్న స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, రోహిత్ త్వరలోనే జట్టులోకి వస్తారని హార్దిక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఈ టోర్నీలో మూడు మ్యాచ్ లు ఆడిన రోహిత్ 21 పరుగులే చేశాడు. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై డకౌట్, ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 8 రన్స్, ఆర్సీబీపై 13 పరుగులు చేశాడు. మొత్తం 3 మ్యాచ్ ల్లో 21 పరుగులతో విఫలమయ్యాడు. గత జనవరిలో ఆస్ట్రేలియాపై ఐదో టెస్టులో గాయపడిన జస్ ప్రీత్ బుమ్రా ఇంకా కోలుకోలేదు. తనెప్పుడు అందుబాటులోకి వచ్చే దానిపై స్పష్టత లేదు. ఇక ఈ సీజన్ లో ముంబై తడబడుతోంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్ లాడిన ముంబై.. కేవలం ఒక్కదానిలోనే విజయం సాధించింది. మూడింటిలో మూడు మ్యాచ్ ల్లో పరాజయం పాలైంది.