ఎప్పుడూ ఎవరూ నెంబర్ వన్ స్థానంలోనే ఉండిపోరు. ప్రతిదానికి ఉచ్చ స్థితి.. అధమ స్థాయి ఉంటాయి. ప్రస్తుతం అలాంటి ఇబ్బందినే పేస్ చేస్తోంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్ లో ఒకటిగా పేరు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో కనీసం ప్లే ఆఫ్ చేరుకోలేక ఇబ్బంది పడుతోంది. ప్లే ఆఫ్ సంగతి దేవుడెరుగు పాయింట్ల పట్టికలో లాస్ట్ లో ఉండిపోవడం ఆ జట్టు ఫ్యాన్స్ ని కలిచి వేస్తోంది. అంతటి మేటి జట్టుకు ఇలాంటి పరిస్థితి ఏంటా అని సగటు సీఎస్కే ఫ్యాన్ గుండె ముక్కలైపోయిన పరిస్థితి సోషల్ మీడియా చూస్తే తెలుస్తుంది. ఈ సీజన్లో సీఎస్కే ఇలా పతనం అవ్వడానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయని స్పోర్ట్స్ ఎనలిస్ట్ లు చెబుతున్నారు.
1) జట్టు వేలం దగ్గరే పొరబాటు చేసిన CSK యాజమాన్యం
ఈసారి ప్లేయర్స్ కొనుగోలులోనే సీఎస్కే యాజమాన్యం పెద్ద పొరపాటు చేసింది. పవర్ హిట్టింగ్ బ్యాటర్లను తీసుకునే ఆలోచన బదులు ఎక్కువగా స్పిన్నర్ల మీద దృష్టి పెట్టింది. ఎలాగూ అన్ క్యాప్డ్ ప్లేయర్గా ధోనిని తక్కువ రేట్ కి దక్కించుకున్నాం.. శివం దూబే జట్టులోనే ఉన్నాడు కాబట్టి వేరే హిట్టర్స్ అవసరం లేదని భావించారో ఏమో కానీ ఆ స్ట్రాటజీ మాత్రం వర్కౌట్ కాలేదు. ఇషాన్ కిషన్, KL రాహుల్ ఇలాంటి వాళ్లు ఆ సమయానికి అందుబాటులో ఉన్నా వాళ్ళ కోసం సీఎస్కే ట్రై చేయనేలేదు అనే విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. ఒకపక్క వైభవ్ సూర్యవంశీ లాంటి చిన్న వయసు క్రికెటర్లు భారీ షాట్లతో విరుచుకుపడుతుంటే సీఎస్కే మాత్రం ఇంకా విజయ శంకర్, రాహుల్ త్రిపాఠి లాంటి వాళ్ళ మీదే నమ్మకం ఉంచుతూ వచ్చింది. ఐపీఎల్ ప్రారంభించిన నాటికి ప్రస్తుత సీజన్కు పూర్తిగా ఆట స్వరూపమే మారిపోయింది అన్న విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మర్చిపోయింది అని స్పోర్ట్స్ ఎక్సపర్ట్స్, మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
2) ఘోరంగా ఫెయిల్ అయిన బ్యాటర్లు
ఐపీఎల్ 2025 సీజన్లో అన్ని జట్లు కలిపి చేసిన పరుగుల లెక్కన టాప్ 20 బ్యాట్స్మెన్ తీసుకుంటే ఆ 20 మందిలో ఒక్క సీఎస్కే ప్లేయర్ కూడా లేడు అంటే నమ్మగలరా..? కానీ అదే నిజం. ఈ ఆర్టికల్ రాసే సమయానికి 21వ స్థానంలో రవీంద్ర జడేజా (260) , 23వ స్థానంలో శివం దూబే (256) ఉన్నారు. వీరికి మొదటి స్థానంలో ఉన్న విరాట్ కోహ్లీకి (505 పరుగులు) మధ్య తేడా అటుఇటు గా 250 పరుగులు. అంటే సగానికి సగం తేడా. ఇది చాలు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఎంత అధ్వానంగా సాగింది అనడానికి. యువ సంచలనం ఆయుష్ మాత్రే నిన్నటి మ్యాచ్లో అదరగొట్టినా చెన్నై ను గట్టు ఎక్కించడానికి అది సరిపోలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రచిన్ రవీంద్ర (191 పరుగులు ) కూడా ఈ సీజన్లో చేతులు ఇత్తేసాడు. ఇక అభిమానులకు బాధ కలిగించినా మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో ఘోరంగా విఫలమయ్యాడని చెప్పక తప్పదు. ఒక్క మ్యాచ్ మినహా మిగిలిన వాటిలో తన మెరుపులు లేవు. చివరి దాకా వచ్చిన మ్యాచ్లను సైతం ఫినిష్ చేయలేకపోతున్నాడు.
3) పర్వాలేదు అనిపించుకున్న బౌలింగ్ - కానీ
బౌలింగ్లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో కొంతమేర పరవాలేదు అనిపించుకుంది. సీజన్ మొత్తం మీద టాప్ టెన్ లో మూడో స్థానంలో నూర్ అహ్మద్ (16 వికెట్స్), ఏడో స్థానంలో ఖలీల్ అహ్మద్ (14 వికెట్స్) ఉన్నారు. పతిరాణా (12 వికెట్స్) తో 18 వ స్థానం లో కొనసాగుతున్నాడు. సీఎస్కే బౌలర్లు వికెట్స్ బాగానే తీసినా పరుగులు మాత్రం ధారాళంగా సమర్పించుకున్నారు. పతిరాణా అయితే వైడ్లు విపరీతంగా వేశాడు. నిన్నటి మ్యాచ్లో ఆర్సీబీ బ్యాట్స్మెన్ రొమారియో షెఫర్డ్ అయితే సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ ఓవర్లో ఏకంగా 33 పరుగులు కొట్టి రికార్డు సృస్టించాడు.
4) జట్టులో కుదరని కూర్పు
బహుశా ఐపిఎల్ 2025 లో ఏ జట్టు మార్చనన్ని కాంబినేషన్లను CSK ట్రై చేసింది.20 కి పైగా ఆటగాళ్లను వేరే వేరే మ్యాచ్ ల్లో ట్రై చేసింది. కానీ అలా వచ్చిన ఆటగాళ్లు ప్రభావం చూపింది చాలా తక్కువ. మరోవైపు RCB ని తీసుకుంటే జట్టులోకి వచ్చిన ప్రతి ఆటగాడు ఒక్కో గేమ్ లో మ్యాచ్ విన్నర్లు గా మారారు. విరాట్ కోహ్లీ, పటిదార్, ఫిల్ సాల్ట్, హెజెల్ వుడ్, షెఫర్డ్, ఎంగిడి,బెతేల్, కృనాల్ పాండ్య, భువి ఇలా చాలామంది మ్యాచ్ విన్నింగ్ లో తమ పాత్రను సమర్థవంతం గా పోషిస్తున్నారు. CSK లో ఆ విన్నింగ్ కాంబినేషన్ కుదరడం లేదు.
5) మితిమీరిన వ్యక్తి పూజ
ధోని ఎంత గొప్ప ఆటగాడో.. ఎంత మంచి కెప్టెనో ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే ఇటీవల సీఎస్కే అభిమానులు ధోనికి విపరీతంగా వ్యక్తి పూజ చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. చివరికి ధోని బ్యాటింగ్ కోసం సొంత జట్టులో ఆడే టాప్ అర్డర్ తొందరగా అవుట్ అయిపోవాలని వారు కేకలు పెడుతున్నారంటేనే పరిస్థితి అర్థం అవుతోంది. ధోని, రోహిత్, కోహ్లీ వంటి స్టార్ ల బ్రాండింగ్, ఇమేజ్ వల్లే ఐపీఎల్ కు ప్రస్తుతం క్రేజ్ కొనసాగుతుందని అందరికీ తెలిసిందే. అయితే ధోని పట్ల సీఎస్కే ఫ్యాన్స్ చూపిస్తున్న అతి ప్రేమ వ్యక్తి పూజ వల్ల సీఎస్కే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక పోతుందా అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆటగాడి కన్నా ఆట ముఖ్యమైన్నది ఇండియన్ క్రికెట్ కు నేర్పించే ధోని. మరి ఆ చిన్న లాజిక్ ని సీఎస్కే ఎలా మర్చిపోతుందో తెలియడం లేదు. ఈ కారణాలన్నీ ఎలా ఉన్నా మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఐదుసార్లు విన్నర్, మరో ఐదు సార్లు ఫైనలిస్ట్ అయిన CSK ఈ సీజన్లో ఇలా అట్టడుగున నిలవడం ఆ జట్టు ఫ్యాన్స్కే కాదు.. సగటు ఐపిఎల్ అభిమానికి కూడా మింగుడు పడడం లేదు.