IPL 2025 RCB 2nd Win : ఆర్సీబీ సాధించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై జెండా పాతింది. 2008లో తొలిసారి చేపాక్ స్టేడియంలో గెలుపొందిన ఆర్సీబీ.. మళ్లీ 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ను తన సొంతగడ్డపై ఓడించింది. అన్ని రంగాల్లో రాణించిన బెంగళూరు.. చెన్నైని ఈజీగా 50 పరుగులతో మట్టి కరిపించింది. అంతకుముందు శుక్రవారం టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 196 పరుగులు చేసింది. రజత్ పతిదార్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ (32 బంతుల్లో 51)తో స్టన్నింగ్ ఫిఫ్టీ చేశాడు. నూర్ అహ్మద్ మూడు వికెట్లతో సత్తా చాటి, పర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. అనంతరం చెన్నై ఛేదనలో చేతులెత్తేసింది. ఓవర్లన్నీ ఆడి.. 8 వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41, 5 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జోష్ హేజిల్ వుడ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక పవర్ ప్లేలో మూడు వికెట్లు పడ్డాక, మ్యాచ్ గెలవడం కంటే కూడా ఓటమి అంతరాన్ని తగ్గించడంపైనే చెన్నై ఫోకస్ పెట్టి ఆడినట్లుగా అనిపించింది. దీంతో బెంగళూరు సునాయసంగా విక్టరీని సొంతం చేసుకుంది.
రాణించిన రజత్.. బ్యాటింగ్ కు కాస్త కష్టమైన వికెట్ పై రజత్ తన క్లాస్ ని చూపించాడు. నిజానికి పస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటర్లకు శుభారంభం దక్కినా యూస్ చేసుకోలేదు. ఫిల్ సాల్ట్ (32), విరాట్ కోహ్లీ (31), దేవదత్ పడిక్కల్ (27) మంచి ఆరంభం లభించాక వికెట్లు పారేసుకున్నారు. ఈ దశలో రజత్.. చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగి ఫలితం సాధించాడు. వేగంగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగెలెత్తింది. ఈ క్రమంలో రజత్ 30 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని వెనుదిరిగాడు. టిమ్ డేవిడ్ (22 నాటౌట్) చివర్లో వేగంగా ఆడటంతో ఆర్సీబీకి భారీ స్కోరు దక్కింది. మిగతా బౌలర్లలో మతీషా పత్తిరాణ కు రెండు వికెట్లు దక్కాయి.
చేతులెత్తేసిన చెన్నై.. బ్యాటింగ్ కు కష్ట సాధ్యమైన వికెట్ పై చెన్నై బ్యాటర్లు చేతులెత్తేశారు. ముఖ్యంగా పవర్ ప్లేలో కీలకమైన ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), కెప్టెన్ రుతురాజ్ పతిదార్ డకౌట్, దీపక్ హుడా (4) వికెట్లను కోల్పోయి, ఆత్మ రక్షణలో పడింది. ముఖ్యంగా హేజిల్ వుడ్.. సీఎస్కేను వణికించాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా విఫలం కావడంతో చెన్నై ఏ దశలోనూ విజయం వైపు నడవలేదు. చివర్లో రవీంద్ర జడేజా (25), ఎంఎస్ ధోనీ (30 నాటౌట్) సత్తా చాటారు. ముఖ్యంగా ధోనీ రెండు కళ్లు చెదిరే సిక్సర్లతో అలరించాడు. వీరిద్దరూ వేగంగా ఆడి ఓటమి అంతరాన్ని తగ్గించగలిగారు. ఈ క్రమంలో ఐపీఎల్లో మూడు వేల పరుగుల మైలురాయిని జడేజా అధిగమించాడు. మిగతా బౌలర్లలో యశ్ దయాల్, లియామ్ లివింగ్ స్టన్ లకు రెండేసి వికెట్లు దక్కాయి. రజత్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.