IPL 2024: రవీంద్ర జడేజా ఇండియన్ క్రికెట్‌కి, చెన్నై సూపర్ కింగ్స్‌కి అద్భుతమైన విజయాలను అందించి పెట్టే రాక్ స్టార్. ఈ సీజన్‌తో క్రికెట్ తలపతి అనే ట్యాగ్ లైన్‌నూ సంపాదించుకున్న జడేజా పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తన ఖలేజా ఏంటో చూపించాడు. అదరగొట్టే ఆల్ రౌండర్ అనే తన పేరుకు న్యాయం చేసేలా ఈ సీజన్‌లో తొలిసారి అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో పదును చూపించాడు. తొలుత బ్యాటింగ్‌లో 26బంతుల్లో 3ఫోర్లు 2 సిక్సర్లతో 43పరుగులు చేసిన జడ్డూ...165 స్ట్రైక్ రేట్‌తో చెన్నైకి 167పరుగుల గౌరవప్రదమైన స్కోరు అందించాడు. 


తర్వాత బౌలింగ్‌లో పంజాబ్ స్టార్ బ్యాటర్ల పని పట్టాడు జడేజా. ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్, కెప్టెన్ శామ్ కర్రన్, ఫినిషర్ యంగ్ పవర్ ఫుల్ హిట్టర్ అశుతోష్ శర్మ వికెట్లు తీసి చెన్నైకి విజయాన్ని అందించాడు. నాలుగు ఓవర్లు  బౌలింగ్ చేసి 20పరుగులు మాత్రమే ఇచ్చి ఈ మూడు వికెట్లు సాధించాడు. 


జడ్డూ ధాటికి పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 139పరుగులు మాత్రమే చేయగలిగింది. నిన్న మ్యాచ్ తర్వాత ఇచ్చే అవార్డులన్నీ జడేజాకే దక్కాయంటే అర్థం చేసుకోవచ్చు మ్యాచ్ మీద అతని డామినెన్స్ ఎంతుందో. మొత్తంగా కీలక సమయంలో ఫామ్‌లోకి రావటంతో ద్వారా రాబోయే మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకి వెన్నెముకలా మారనున్నాడు క్రికెట్ తలపతి జడేజా.