Jadeja Milestone: రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 21 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా అదిరిపోయే రికార్డును సొంతం చేసుకున్నాడు.


టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్ల మైలురాయిని జడ్డూ అందుకున్నాడు. దీని కారణంగా డ్వేన్ బ్రేవో, లసిత్ మలింగ లాంటి దిగ్గజ బౌలర్ల సరసన రవీంద్ర జడేజా నిలిచాడు. 296 టీ20లు ఆడిన జడేజా 30.25 బౌలింగ్ యావరేజ్‌తో 200 వికెట్లను పడగొట్టాడు. గతంలో 16 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లను జడేజా పడగొట్టాడు. ఇదే అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.


ఇప్పటి వరకు 64 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రవీంద్ర జడేజా 28.49 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా ఎకానమీ రేటు 7.04గా ఉండటం విశేషం. 15 ఏళ్ల ఐపీఎల్ కెరీర్‌లో రవీంద్ర జడేజా చెన్నై, రాజస్థాన్, గుజరాత్ లయన్స్, కొచ్చి టస్కర్స్ కేరళ ఫ్రాంఛైజీలకు ఆడాడు. మొత్తంగా 214 మ్యాచ్‍‌ల్లో 30.05 సగటుతో 138 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన 11వ బౌలర్‌గా నిలిచాడు.


ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డ్వేన్ బ్రేవో (183) పేరిట ఉంది. అతడి తర్వాత యుజ్వేంద్ర చాహల్ 176 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక లసిత్ మలింగ 170 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత స్థానాల్లో అమిత్ మిశ్రా(169), రవిచంద్రన్ అశ్విన్(163) వికెట్లతో ఉన్నారు.


టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో బ్రేవో 615 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 536 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ 484 వికెట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ఇక సౌతాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ 469 వికెట్లతో నాలుగో స్థానంలోనూ, బంగ్లా బౌలర్ షకీబుల్ హసన్ 451 వికెట్లతో ఐదో స్థానంలో నిలిచాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే... చెపాక్‌లో సంజూ సేన అద్భుతం చేసింది. సీఎస్‌కే ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెట్టించింది. ధోనీ సేన చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను ఆఖరి బంతికి లాగేసుకుంది. 3 పరుగుల తేడాతో అమేజింగ్‌ విక్టరీ అందుకుంది. 176 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది. ఛేదనకు దిగిన సీఎస్‌కేను 172/6కు పరిమితం చేసింది. డేవాన్‌ కాన్వే (50; 38 బంతుల్లో 6x4) హాఫ్ సెంచరీ చేశాడు. ఎంఎస్‌ ధోనీ (32*; 17 బంతుల్లో 1x4, 3x6), రవీంద్ర జడేజా (25*; 15 బంతుల్లో 1x4, 2x6) మెరుపు షాట్లు బాదేశారు. అంతకు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌లో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (52; 36 బంతుల్లో 1x4, 3x6) హాఫ్‌ సెంచరీ కొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (38; 26 బంతుల్లో 5x4), రవిచంద్రన్‌ అశ్విన్‌ (30; 22 బంతుల్లో 1x4, 2x6) రాణించారు. ఆఖర్లో షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (30*; 10 బంతుల్లో 1x4, 2x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు.


ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్‌ స్టార్ట్‌ రాలేదు. సందీప్‌ శర్మ వేసిన 2.2వ బంతికే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో అజింక్య రహానె (31; 19 బంతుల్లో 2x4, 1x6) అండతో మరో ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే నిలబడ్డాడు. వీరిద్దరూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి సీఎస్కే 45/1తో నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచి రెండో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు. రన్‌రేట్‌ పెరగకుండా అడ్డుకున్న ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద రహానెను ఎల్బీ చేయడం ద్వారా అశ్విన్‌ విడదీశాడు. ఆ తర్వాత శివమ్‌ దూబె (8), మొయిన్‌ అలీ (7), అంబటి రాయుడు (1) వెంటవెంటనే ఔటవ్వడంతో మెరుగైన భాగస్వామ్యాలు రాలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కాన్వే 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అతడిని చాహల్‌ ఔట్‌ చేశాడు. దాంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 40గా మారింది. ధోనీ అండతో 19వ ఓవర్లో జడేజారెండు సిక్సులు, ఒక బౌండరీ బాది 19 రన్స్‌ అందించాడు. ఆఖరి ఓవర్లో 21 రన్స్‌ అవసరం కాగా.. సందీప్‌ శర్మ 17 రన్సే ఇచ్చాడు. అయితే మహీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి రాయల్స్‌ను భయపెట్టాడు. ఆఖరి బంతికి 5 రన్స్‌ అవసరం ఉండగా సింగిల్‌ మాత్రమే తీశాడు.