Team Players ready : ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(IPL) మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని జట్లు ఈ సారి కప్పును కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క ఆటగాడు.. వారి ప్రాంచైజీ జట్టుతో చేరుతున్నారు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Sreyas iyer) పీఎల్‌ కోసం కోల్‌కతాలో అడుగుపెట్టాడు. వెన్నునొప్పి గాయంతో లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశముందన్న వార్తలను తోసిపుచ్చుతూ అయ్యర్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ క్యాంప్‌లో జట్టుతో చేరాడు. కెప్టెన్‌ అయ్యర్‌ వచ్చేశాడంటూ కేకేఆర్‌ తమ సోషల్‌మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేసింది. గాయం కారణంగా గత సీజన్‌కు పూర్తిగా అయ్యర్‌ దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఐపీఎల్‌ 17వ సీజన్‌ కోసం ఆస్ట్రేలియా హార్డ్‌హిట్టర్‌ ట్రావిస్‌ హెడ్‌... సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో చేరాడు. వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా గెలువడంలో కీలకంగా వ్యవహరించిన హెడ్‌..ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలో ఆడబోతున్నాడు. సరిగ్గా ఏడేండ్ల క్రితం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ఆడిన హెడ్‌..ఇప్పుడు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన ఆగమనంపై హెడ్‌ మాట్లాడిన వీడియోను ఎస్‌ఆర్‌హెచ్‌ తమ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ‘లీగ్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. జట్టు మెరుగ్గా కనిపిస్తోందని అన్నాడు.


కోహ్లీ ఆగయా...
ఐపీఎల్‌లో మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్‌ మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా రన్‌ మెషీన్‌, స్టార్ బ్యాటర్‌ కింగ్‌ కోహ్లీ వచ్చేశాడు. ఐపీఎల్‌ 2024లో పాల్గొనేందుకు భారత గడ్డపై అడుగుపెట్టాడు. ముంబైవిమానాశ్రయంలో విరాట్ కనిపించారు. గత రెండు నెలలుగా కుటుంబంతో కలిసి లండన్‌లో ఉన్న విరాట్‌... తొలి మ్యాచ్‌ ఆడేందుకు స్వదేశానికి వచ్చాడు. కోహ్లీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు శిక్షణ శిబిరంలో చేరనున్నాడు. కోహ్లి వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తొలుత కథనాలు వచ్చాయి. అయితే భార్య అనుష్క శర్మ ప్రసవం కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లేందుకు కోహ్లి విరామం తీసుకున్నట్లు తర్వాత స్పష్టమైంది. కోహ్లి, అనుష్క దంపతులకు ఇప్పటికే ఓ కూతురున్న సంగతి తెలిసిందే. విరాట్‌ సతీమణి అనుష్క శర్మ ఇటీవల లండన్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ బిడ్డకు అకాయ్‌ అనే పేరును పెట్టినట్లు విరాట్‌, అనుష్కశర్మలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కుటుంబంతో గడిపేందుకు లండన్‌ వెళ్లిన కోహ్లీ.. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. 


ధోనీతోనే తొలి యుద్ధం
తొలి మ్యాచ్‌లోనే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB), చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)అమితీమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్‌ కైఫ్‌(Mohammad Kaif)... కోహ్లీ( Virat Kohli) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ రెండేళ్ల నుంచి అద్భుతమైన క్రికెట్ ఆడుతున్నాడని.. ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత మరింత దూకుడుగా ఉన్నాడని గుర్తు చేశాడు. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన కోహ్లీకి ఎప్పుడు ఎలా ఆడాలో బాగా తెలుసని అన్నాడు. విరామం తీసుకొని వచ్చాక అతడిని ఆపడం ఎవరితరమూ కాదని... కొందరు విశ్రాంతి తీసుకుని వచ్చాక కుదురుకోవడానికి సమయం తీసుకుంటారని... కోహ్లీ తీరు దానికి భిన్నమని కైఫ్‌ ప్రత్యర్థి జట్లను హెచ్చరించాడు. విరామం తర్వాత బరిలోకి దిగుతున్న కోహ్లీ మరింత ప్రమాదకరంగా ఆడతాడని.... ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలంటే విరాట్ కీలకమని కైఫ్‌ వ్యాఖ్యానించాడు. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి మ్యాచ్‌లో తలపడనుంది.