MI vs SRH IPL 2024  Mumbai Indians opt to bowl: వాంఖడే వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌,  ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగే మ్యాచ్ లో ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య టాస్‌ గెలిచి హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు అప్పగించాడు.  ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకాలని హైదరాబాద్‌ చూస్తుండగాnపరువు కోసం ముంబై పాకులాడుతోంది.  నిజానికి ముంబయికి ఈ మ్యాచ్‌ ఫలితంతో  వచ్చే ప్రయోజనం ఏం లేదు.  కానీ  ఈ మ్యాచ్‌లో ఓడితే హైదరాబాద్‌ ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతాయి.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిస్తే ఆత్మవిశ్వాసం లోపించిన ముంబైపై విజయం కష్టమేమీ కాదు.


వాంఖడే పిచ్‌ అంటే  బ్యాటర్లు తగ్గేదే లే.. 
వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కు అద్భుతంగా ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 170. వాంఖడే పిచ్ పరిస్థితుల ప్రకారం టాస్ గెలిచిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ . కానీ ఈసారి టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ ను హైదరాబాద్ కు అప్పగించింది. వాంఖడేలో ఫ్లడ్‌లైట్ల కింద కొత్త బాల్ ఎక్కువగా స్వింగ్ అవుతుంది. ఛేజింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. పవర్ ప్లే‌లో దూకుడుగా ఆడితే భారీ స్కోర్లు నమోదవ్వడం ఖాయం.


ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్ కు ప్రతి మ్యాచ్ కీలకమే..
ఐపీఎల్‌లో ఈ సీజన్‌ పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ 16 పాయింట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్ 14 పాయింట్లు, లక్నో సూపర్ జెయింట్స్ 12 పాయింట్లతో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. నాలుగో స్థానంలో హైదరాబాద్ ఉంది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకం కావడంతో ఈ మ్యాచ్‌లో గెలవాలని ప్యాట్‌ కమిన్స్‌ సేన గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో హైదరాబాద్‌ బ్యాటర్లు జోరు మీద ఉన్నారు. ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు సాధించారు. మరోసారి హైదరాబాద్‌ బ్యాటర్లు జోరు అందుకుంటే ముంబై ఇండియన్స్‌కు కష్టాలు తప్పవు. వాంఖడే స్టేడియంలో పిచ్‌ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. మరోసారి హైదరాబాద్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. వాంఖడేలో బౌండరీలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు 200కంటే ఎక్కువ పరుగులే చేస్తుంది.


పరువు నిలవాలంటే గెలవాల్సిందే.. 
పాయింట్ల పట్టికలో అట్టడుగున ముంబైకు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని ముంబై చూస్తోంది. 11 మ్యాచ్‌లలో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించిన ముంబై ప్లే ఆఫ్‌కు దాదాపుగా దూరమైంది. రాబోయే T20 ప్రపంచ కప్ కోసం రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఫామ్‌లోకి రావడం టీమిండియాకు అవసరం. ఈ మ్యాచ్‌లో అయినా పాండ్యా రాణిస్తాడేమో చూడాలి.  కెప్టెన్ పాండ్యా బ్యాటింగ్‌, బౌలింగ్‌లోనూ విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సూర్యకుమార్ కోల్‌కత్తాపై మంచి అర్ధ సెంచరీ చేసి సత్తా చాటాడు.


ముంబయి ఇండియన్స్‌ తుది జట్టు: 


ఇషాన్‌ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్ది్క్ పాండ్య (కెప్టెన్), టిమ్ డేవిడ్, అన్షుల్ కాంబోజ్(అరంగేట్రం), పీయూష్‌ చావ్లా, జస్‌ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార. 


సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు:


అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సన్‌, పాట్ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, నటరాజన్.