Ruturaj Gaikwad becomes the fastest Indian in IPL history to score 2000 runs : చెన్నై సూపర్ కింగ్స్(CSK) సారధి రుతురాజ్ గైక్వాడ్( Ruturaj Gaikwad )... అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలు రాయి అందుకున్న తొలి భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరవడం ద్వారా రుతురాజ్ ఈ ఘనత సాధించాడు. షెఫర్డ్ బౌలింగ్‌లో బౌండరీ బాది ఐపీఎల్‌లో 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 57 ఇన్నింగ్స్‌ల్లో  ఈ ఘనత సాధించిన రుతురాజ్‌... సచిన్ టెండూల్కర్‌, కేఎల్ రాహుల్‌ల రికార్డును బద్దలుకొట్టాడు. మొత్తంగా ఐపీఎల్‌లో యూనివర్సల్‌ బాస్‌ క్రిస్‌ గేల్ 48 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగుల మార్క్‌ను అందుకొని అగ్రస్థానంలో ఉన్నాడు. తర్వాత షాన్ మార్ష్ 52 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నాడు,. 57 ఇన్నింగ్సుల్లో  రుతురాజ్ 2 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తర్వాతి స్థానాల్లో కేఎల్ రాహుల్ 60 ఇన్నింగ్స్‌లు, సచిన్ టెండూల్కర్  63 ఇన్నింగ్సుల్లో 2 వేల పరుగుల మైలురాయిని చేరుకుని తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

 

రోహిత్ అద్భుత శతకం వృథా

 

ముంబై ఇండియన్స్‌పై  చెన్నై సూపర్‌ కింగ్స్‌ పంజా విసిరింది. వారిని వారి సొంత మైదానంలోనే ఓడించింది. రోహిత్‌ శర్మ విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్‌ పతిరన నాలుగు వికెట్లతో ముంబై పతనాన్ని శాసించాడు. దీంతో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్‌ శర్మ అజేయ శతకంతో మెరిశాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేసిన చివరి వరకూ అజేయంగా క్రీజులో నిలబడ్డ రోహిత్‌... ముంబైను గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌.,.. శివమ్‌ దూబే మెరుపు బ్యాటింగ్‌తో చెన్నై భారీ స్కోరు చేసింది. చివర్లో ధోనీ మెరుపులు మెరిపించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొన్న ధోనీ మూడు సిక్సులు, రెండు పరుగులతో 20 పరుగులు చేశాడు. ధోనీ బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు వాంఖడే మార్మోగిపోయింది. అనంతరం 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రోహిత్‌ శర్మ శతకంతో 186 పరుగులు చేయగలిగింది. ముంబైలో మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయ దుంధుభి మోగించింది. 

 

300 సిక్సర్ల క్లబ్‌లో రాహుల్‌

లక్నో సూపర్ జెయింట్స్ సారధి కే.ఎల్. రాహుల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ 20 మ్యాచుల్లో 300 సిక్సర్లు బాదిన ఐదో భార‌త ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ ఈ ఘ‌న‌త సాధించాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో టీ 20 మ్యాచుల్లో మూడు వందల సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తం 218 టీ20 మ్యాచుల్లో 300 సిక్సర్ల మైలురాయిని చేరుకున్నాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భార‌త ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్‌మ్యాన్‌ ఏకంగా 497 సిక్సర్లు బాదాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, సురేశ్ రైనా ఉన్నారు. రోహిత్ శ‌ర్మ  431 మ్యాచుల్లో 497 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా... విరాట్ కోహ్లి 382 మ్యాచుల్లో 383 సిక్సర్లు కొట్టి రెండో స్థానంలో నిలిచాడు. ఎంఎస్ ధోని 382 మ్యాచుల్లో 328 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా.... సురేశ్ రైనా 336 మ్యాచుల్లో 325 సిక్సర్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కేఎల్ రాహుల్ 218 మ్యాచుల్లో 300 సిక్సర్లు కొట్టి అయిదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ కొట్టిన ఐపీఎల్‌లో 178 సిక్సర్లు కొట్టగా... టీమ్ఇండియా త‌రుపున 99 సిక్సర్లు బాదాడు. దేశవాళీలో కర్ణాట‌క త‌రుపున 23 సిక్సర్లు కొట్టాడు.