IPL 2025 PBKS Climbs to Top-4 in Points table: ఎడతెరిపి లేని వర్షం కురవడం వల్ల కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రద్దయ్యింది. శనివారం కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల‌కు 201 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ సూప‌ర్ ఫిఫ్టీ (49 బంతుల్లో 83, 6 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) తో స‌త్తా చాటాడు. బౌల‌ర్ల‌లో వైభ‌వ్ అరోరాకు రెండు వికెట్లు ద‌క్కాయి. అనంత‌రం ఛేజింగ్ ప్రారంభించిన కేకేఆర్ తొలి ఓవ‌ర్లో వికెట్లేమీ న‌ష్ట‌పోకుండా 7 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో ఎడ‌తెగ‌ని వర్షం కుర‌వ‌డంతో మ్యాచ్ ర‌ద్ద‌య్యింది. దీంతో ఇరుజ‌ట్ల‌కు ఒక పాయింట్ చొప్పున కేటాయించారు. తాజా ఫ‌లితంతో 11 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో నాలుగో స్థానానికి ఎగ‌బాకింది. 

దంచికొట్టిన ఓపెన‌ర్లు..ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఓపెన‌ర్లు ప్రియాంవ్ ఆర్య (35 బంతుల్లో 69, 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), ప్ర‌భ్ సిమ్రాన్ శుభారంభాన్నిచ్చారు. వీరిద్ద‌రూ ఆది నుంచే దూకుడుగా ఆడ‌టంతో స్కోరు బోర్దు వేగంగా ప‌రుగులెత్తింది. ముఖ్యంగా వీరిద్ద‌రూ బౌండ‌రీల‌తో డీల్ చేయ‌డంతో ప‌వ‌ర్ ప్లేలో 56 ప‌రుగులు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత మ‌రింత జోరుగా ఆడ‌టంతో 63 బంతుల్లోనే వీరిద్ద‌రూ 100 ప‌రుగుల తొలి వికెట్ బాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో 38 బంతుల్లో ప్ర‌బ్ సిమ్రాన్, 27 బంతుల్లో ప్రియాంశ్ ఫిఫ్టీలు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత స్కోరు వేగాన్ని పెంచే క్ర‌మంలో ప్రియాంశ్ ఔట‌వ‌డంతో 120 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. ఆ త‌ర్వాత శ్రేయ‌స్ అయ్య‌ర్ (25 నాటౌట్) తో క‌లిసి ప్ర‌బ్ సిమ్రాన్ మ‌రింత దూకుడుగా ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. సెంచ‌రీకి చేరువైన ద‌శ‌లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి తను ఔట‌య్యాడు. ఓపెన‌ర్లిద్ద‌రూ వెనుదిరిగిన త‌ర్వాత పంజాబ్ అనుకున్నంత వేగంగా ఆడ‌లేదు. ఒక ద‌శ‌లో 14.3 ఓవ‌ర్ల‌లో 160/1 తో ఉన్న పంజాబ్.. మిగ‌తా 5.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 41 ప‌రుగులే సాధించించింది. బ్యాటింగ్ లైన‌ప్ లో ప్ర‌యోగాలు చేయ‌డం బెడిసి కొట్టింది. గ్లెన్ మ్యాక్స్ వెల్ (8), మార్కో య‌న్సెన్ (3) విఫ‌ల‌మ‌య్యారు. జోష్ ఇంగ్లీస్ (11 నాటౌట్) కాస్త వేగంగా ఆడాడు. 

కేకేఆర్ కు క‌ష్ట‌మే.. ఇక తొలి ఓవ‌ర్ లో 7 ప‌రుగుల‌తో ఛేజింగ్ ను ఆరంభించిన కేకేఆర్ కు షాక్ త‌గిలింది. వ‌రుణుడు అడ్డు త‌గ‌ల‌డంతో మ్యాచ్ ర‌ద్ద‌య్యింది. ఇప్ప‌టికే 5 ప‌రాజ‌యాల‌తో ఉన్న కేకేఆర్ కు ఈ మ్యాచ్ లో పుంజుకోవ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. అయితే ఈ మ్యాచ్ వ‌ర్షార్ప‌ణం అవ‌డంతో, ఎదురుదెబ్బ త‌గిలిన‌ట్లు అయ్యింది. మిగ‌తా ఐదు మ్యాచ్ ల్లో క‌చ్చితంగా క‌నీసం నాలుగింటిలో భారీ విజ‌యాలు న‌మోదు చేయాలి. అప్పుడే డిఫెండింగ్ చాంపియ‌న్ ప్లే ఆఫ్స్ కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. ఇక పంజాబ్ భారీ స్కోరు చేసిన‌ప్ప‌టికీ, ఇలా మ్యాచ్ ర‌ద్దు కావ‌డంపై నిరాశ క‌లిగించింది. ఇదే జ‌ట్టుపై 112 ప‌రుగుల టార్గెట్ ను కాపాడుకున్న పంజాబ్.. ఈ మ్యాచ్ లో విజ‌యం సాధిస్తామ‌ని ధీమాగా ఉంది. అయితే మ్యాచ్ ర‌ద్దు కావ‌డంతో 11 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఏదేమైనా ఇరుజట్ల మ‌ధ్య ప‌సందైన మ్యాచ్ జ‌రుగుతంద‌ని ఆశించిన అభిమానుల‌కు నిరాశే ఎదురైంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.