Mayank Yadav injury update: కళ్ళు అటు తిప్పి ఇటు తిరిగే లోపే బాల్ దూసుకెళ్లింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే గంటకు 156 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. నయా సంచలనం మయాంక్ యాదవ్‌(Mayank Yadav)నిలకడగా 150+ కి.మీ వేగంతో బంతులేస్తూ స్టార్‌ క్రికెటర్లనే ఆశ్చర్యపరిచాడు. తాజాగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్‌ కేవలం ఒక్క ఓవర్‌ మాత్రమే బౌలింగ్‌ చేసి మైదానాన్ని వీడాడు. అయితే అతడికి ఏమైందనే ప్రశ్నలు తలెత్తాయని దీనిపై లక్నో సీఈవో స్పందించారు. 



లక్నో సీఈవో ఏమన్నాడంటే..?
 పేస్‌ స్టార్‌ మయాంక్‌ యాదవ్‌ గాయంపై లక్నో సూపర్ జెయింట్స్ సీఈఓ వినోద్ బిష్త్(Vinod Bisht) కీలక ప్రకటన చేశారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మయాంక్ గాయపడ్డాడు, మయాంక్ యాదవ్ మొదటి  ఓవర్‌లో 13 పరుగులు ఇచ్చాడు. తర్వాత మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఈ పరిస్థితుల్లో మయాంక్‌ ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు తలెత్తాయి. "మయాంక్ యాదవ్ పొత్తికడుపులో కాస్త నొప్పితో బాధపడుతున్నాడు. ఆ సమస్య తీవ్రం కాకుండా ఉండేందుకే గుజరాత్‌ మ్యాచ్‌లో మైదానాన్నీ వీడాడు. మయాంక్ త్వరలో మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నాం" అని లక్నో సూపర్ జెయింట్స్ సీఈఓ వినోద్ బిష్త్ ప్రకటించారు. మయాంక్ యాదవ్ ఇప్పటివరకు 3 మ్యాచ్‌లలో 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు ఆడింది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయినా, ఆ తర్వాత హ్యాట్రిక్ విజయాలు సాధించింది. లక్నో తర్వాతి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో  ఏప్రిల్ 12న ఎకానా స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మయాంక్‌ బరిలోకి దిగుతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.



కృనాల్‌ చెప్పినా..
గుజరాత్‌పై విజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ సీనియర్ ప్లేయర్ కృనాల్ పాండ్యా మయాంక్ యాదవ్ గాయంపై స్పందించాడు. అతనికి సీరియస్ ఇంజ్యూరీ ఏం కాలేదని తెలిపాడు. 'మయాంక్ యాదవ్ బాగానే ఉన్నాడు. అతని ఎలాంటి సీరియస్ ఇంజ్యూరీ కాలేదు. గత రెండేళ్లుగా అతన్ని నేను దగ్గరగా చూస్తున్నాను. బౌలింగ్ గన్‌లా అతను నెట్స్‌లో బౌలింగ్ చేసేవాడు. అతనికి మంచి బలం ఉంది.'అని చెప్పుకొచ్చాడు. సీరియస్ ఇంజ్యూరీ కాదని కృనాల్ పాండ్యా చెబుతున్నా.. మయాంక్ యాదవ్ మరో రెండు మ్యాచ్‌ల వరకు దూరమయ్యే అవకాశం ఉంది.



నయా స్పీడ్‌ స్టార్‌
పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో తన పేస్‌తో 6 వికెట్లు పడగొట్టాడు. 157.6 కిలోమీటర్ల వేగంతో బంతులు సంధించి ఫాస్టెస్ బాల్ రికార్డ్‌ను అందుకున్నాడు. వేగానికి తోడు కచ్చితమైన లైన్ అండ్ లెంగ్, వేరియేషన్స్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఢిల్లీకి చెందిన 21 సంవత్సరాల పేసర్ మయాంక్ యాదవ్.    దేశీవాళీ క్రికెట్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆ జట్టు తరపున మూడు ఫార్మాట్లలోనూ అతడు అరంగేట్రం చేశాడు. అతడు ఇప్పటివరకు ఒకే ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, 17 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిసి 27 మ్యాచుల్లో 46 వికెట్లు తీశాడు. నార్త్ జోన్ తరఫున ‘దేవధర్ ట్రోఫీ’లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండవ స్థానంలో నిలిచాడు.  కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 12 వికెట్లు తీసి జాయింట్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచాడు.