LSG VS MI  Mumbai Indians target 215: ముంబై(MI)తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు(LSG) జూలు విదిల్చారు. ప్లే ఆఫ్‌ ఆశలు చేరాలంటే అద్భుతాలు జరగాల్సిన వేళ లక్నో తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో మెరుగ్గా ఆడింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ముంబై.. లక్నోను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కెప్టెన్‌ కె.ఎల్‌. రాహుల్‌, నికోలస్‌ పూరన్ అర్ధ శతకాలతో చెలరేగడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ మూడు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ తీయకుండా 30 పరుగులు ఇచ్చాడు.

 

నిలిచిన రాహుల్‌, పూరన్‌

టాస్‌ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన లక్నోకు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్‌ తగిలింది. మూడో బంతికే దేవదత్‌ పడిక్కల్‌ను తుషారా అవుట్‌ చేశాడు. పడిక్కల్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని లక్నోకు తొలి షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్‌ రాహుల్‌, స్టోయినీస్‌ మరో వికెట్‌ పడకుండా కాస్త జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. పవర్‌ ప్లే చివరి బంతికి స్టోయినిస్‌ అవుటయ్యాడు. 22 బంతుల్లో అయిదు ఫోర్లతో 28 పరుగులు చేసిన స్టోయినిస్‌ను పియూష్‌ చావ్లా వికెట్ల ముందు దొరకబుచ్చుకుని అవుట్‌ చేశాడు. అనంతరం 11 పరుగులే చేసి దీపక్‌ హుడా అవుట్‌ అయ్యాడు. 9 బంతుల్లో 11 పరుగులు చేసిన హుడాను కూడా పియూష్‌ చావ్లా పెవిలియన్‌కు పంపి లక్నోను మరో దెబ్బ కొట్టాడు.

ఓ వైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్‌ రాహుల్‌ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. మరీ ధాటిగా ఆడకున్నా చెత్త బంతులను భారీ షాట్లు ఆడాడు. హుడా అవుటైన తర్వాత రాహుల్‌తో జత కలిసిన పూరన్‌ ధాటిగా ఆడాడు. రాహుల్‌- పూరన్‌ భారీ షాట్లు ఆడడంతో లక్నో స్కోరు బోర్డు వేగాన్ని అందుకుంది. పూరన్‌...ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు. అందిన బంతిని అందినట్లే బాదేశాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న పూరన్‌ ఎనిమిది సిక్సర్లు, అయిదు ఫోర్లతో 75 పరుగులు చేసి అవుటయ్యాడు. పూరన్‌ను తుషారా అవుట్‌ చేశాడు. కె.ఎల్‌ రాహుల్‌ కూడా 41 బంతుల్లో 3 ఫోర్లు, మూడు సిక్సర్లతో 55 పరుగులు చేసి పియూష్‌ చావ్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ అర్షద్ ఖాన్‌ ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. కానీ చివర్లో ఆయుష్‌ బదోని, కృనాల్‌ పాండ్యా ధాటిగా ఆడడంతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 214  పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పియూష్‌ చావ్లా, తుషారా మూడేసి వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగిన సచిన్‌ టెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌ 2.2 ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క వికెట్‌ తీయకుండా 22  పరుగులు ఇచ్చాడు.