All the Ball Boys are wearing helmets for the DC vs SRH Match : సన్ రైజర్స్(SRH) మ్యాచ్ అంటే చాలు సిక్సర్ల వర్షం కురవటమే. ఓపెనర్లు హెడ్, అభిషేక్ శర్మ ల దగ్గర మొదలుపెట్టి మార్ క్రమ్, క్లాసెన్, సమద్, షాబాజ్, నితీశ్ రెడ్డి ఇలా ప్రతీ ఒక్కరూ సిక్సర్లు బాదుతూ సన్ రైజర్స్ కి రికార్డు స్థాయి స్కోర్లను అందిస్తున్నారు. మరి ఈ సిక్సర్ల వర్షానికి ప్రభావితం అవుతోంది ప్రత్యర్థి బౌలర్లు మాత్రమే కాదు బౌండరీలు బంతులు అందించే చిన్నపిల్లలు కూడా. అందుకే బాల్ బాయ్స్ కి రక్షణ ఉండాలని హెల్మెట్లు పెట్టి బౌండరీల లైన్స్ దగ్గర ఉంచుతున్నారు. క్రికెట్ అకాడమీలో క్రికెట్ నేర్చుకునే పిల్లలకు సాధారణంగా బాల్ బాయ్స్ గా అవకాశం ఇస్తారు. తమకు ఇష్టమైన క్రికెటర్లను దగ్గర నుంచి ప్రేరణ పొందటం కోసం ఇలాంటి అవకాశాన్ని చిన్నారులకు కల్పిస్తారు.
ఇప్పుడు ఈ ఐపీఎల్లో సన్ రైజర్స్ కురిపిస్తున్న సిక్సర్ల వర్షానికి పిల్లలకు బాల్ తగిలి గాయం అవ్వకుండా ఉండటం కోసమే ఇలా ఏర్పాట్లు చేసినట్లు బీసీసీఐ చెబుతోంది. నిన్న ఢిల్లీతో సన్ రైజర్స్ కి జరిగిన మ్యాచ్ లో ఆరెంజీ ఆర్మీ ఏకంగా 22 సిక్సులు బాదింది. ఢిల్లీ 9 సిక్సులు కొట్టింది. సో మొత్తం మ్యాచ్ లో 31 సిక్సులు పడ్డాయి. ఆ వర్షానికి తడవకుండా ఈ పిల్లలకు హెల్మెట్లు అండ్ బాల్ కోసం వెయిట్ చేస్తున్న ఈ పిల్లల క్యూట్ క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
బౌండరీలే బౌండరీలు
ట్రానిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసానికి మాటలే సరిపోలేదు. తొలి ఆరు ఓవర్లలో హైదరాబాద్ ఓపెనర్లు 11 సిక్సర్లు.. 13 ఫోర్లు కొట్టారంటే వారి బాదుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీరిద్దరికీ బౌలింగ్ చేసేందుకు ఢిల్లీ బౌలర్లు భయపడిపోయారు. పవర్ ప్లేలో హైదరాబాద్ చేసిన 125 పరుగుల్లో 108 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. ఆ తర్వాత అక్షర్ పటేల్ ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, మార్క్రమ్ను అవుట్ చేసి పరుగులను కట్టడి చేశాడు. చివర్లో నితీశ్కుమార్రెడ్డి 27 బంతుల్లో 37 పరుగులు చేసి అవుటయ్యాడు. షెహబాజ్ అహ్మద్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 59 అజేయంగా నిలవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది.
మెక్గుర్క్ మెరుపులు
267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. 16 పరుగుల చేసి పృథ్వీ షా, ఒక పరుగుకే వార్నర్ వెనుదిరిగారు. దీంతో 25 పరుగులకే ఢిల్లీ రెండు వికెట్లు కోల్పోయింది. కానీ మెక్గుర్క్, అభిషేక్ పోరెల్ మెరుపులు మెరిపించారు. మెక్గుర్క్ కేవలం 18 బంతుల్లో 7 సిక్సులు, 5 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. పోరెల్ 22 బంతుల్లో 42 పరుగులు చేశాడు. వీరి దూకుడుతో ఎనిమిది ఓవర్లకే స్కోరు 135 పరుగులకు చేరింది. కానీ వీరు వెంటవెంటనే అవుటవ్వడంతో సన్రైజర్స్ మళ్లీ పోటీలోకి వచ్చింది. చివర్లో పంత్ పోరాడినా ఢిల్లీకి ఓటమి తప్పలేదు.