CSK vs GT, Indian Premier League Final 2023: ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య మే 28వ తేదీన జరగనుంది. ఈ సీజన్ కూడా ఇరు జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది. దీనికి ముందు క్వాలిఫయర్ 1 మ్యాచ్ కూడా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఇప్పుడు ఈ రెండు జట్లూ ఫైనల్ మ్యాచ్‌లో మరోసారి తలపడనున్నాయి.


ఫైనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు టైటిల్ కోసం తమ సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ పైచేయి సాధించిన రికార్డు కూడా ఉంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్వాలిఫయర్ 1లో ఆడిన జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం తొమ్మిది సార్లు జరిగింది. ఆ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు సార్లు క్వాలిఫయర్ 1లో విజయం సాధించిన జట్టే ఫైనల్‌లోనూ విజయం సాధించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది.


ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ కూడా క్వాలిఫయర్ 1లో ఓటమి పాలైంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం అంత సులువు కాదు. అది కూడా లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను గుజరాత్ టైటాన్స్ ఢీకొట్టనుంది.


2022లో జరిగిన ఐపీఎల్ సీజన్‌లో తొలి క్వాలిఫయర్ మ్యాచ్ గుజరాత్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగింది. ఇందులో గుజరాత్ విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. దీని తర్వాత మళ్లీ ఆఖరి మ్యాచ్‌లో రాజస్థాన్‌తో తలపడగా గుజరాత్‌ గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది.


చెన్నై సూపర్ కింగ్స్ రికార్డు ఇలా
ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ రికార్డును పరిశీలిస్తే.. 2011 సీజన్ నుంచి 5 సార్లు క్వాలిఫయర్ 1 మ్యాచ్ ఆడిన తర్వాత.. అదే జట్టుతో ఫైనల్ మ్యాచ్ కూడా ఆడింది. ఇందులో 2013లో జరిగిన క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ముంబైని ఓడించినా, ఫైనల్‌లో ముంబై చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.


2011 సంవత్సరంలో, చెన్నై క్వాలిఫయర్ 1, ఫైనల్‌లో RCBని ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. 2015 సీజన్‌లో ముంబైతో జరిగిన క్వాలిఫయర్ 1, ఫైనల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2018లో చెన్నై క్వాలిఫయర్ 1లో హైదరాబాద్‌ను ఓడించి ఫైనల్‌లో కూడా విజయం సాధించింది. 2019 సీజన్‌లో ముంబై క్వాలిఫైయర్ 1, ఫైనల్ రెండింటిలోనూ చెన్నైని ఓడించింది.


గతేడాది అహ్మదాబాద్ వేదికగానే ఐపీఎల్ - 15 ఫైనల్ (గుజరాత్ - రాజస్తాన్) జరిగింది.  ఫైనల్‌లో ఎఆర్ రెహ్మాన్ గానా భజానాతో పాటు  ప్రముఖ భాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నరేంద్ర మోడీ స్టేడియాన్ని హోరెత్తించారు. ఈ ఏడాది కూడా వాళ్లిద్దరూ వస్తున్నారని  ప్రచారం జరిగినా దానిమీద బీసీసీఐ ఇప్పటివరకు  స్పష్టతనివ్వలేదు.  అయితే ఈసారి  అహ్మదాబాద్  ప్టేడియంలో ఉండేవారితో పాటు టీవీలు, మొబైల్స్ ముందు  ఫైనల్‌ను వీక్షించే కోటానుకోట్ల మందిని అలరించడానికి  యువ సంగీత సంచలనాలు రాబోతున్నాయి.  ప్రముఖ  ర్యాపర్ వివయన్ డివిన్, న్యుక్లెయర్, కింగ్ తో పాటు  తెలుగు   ప్రేక్షకులకు సుపరిచితురాలైన  జొనితా గాంధీ  అభిమానులను అలరించనున్నారు.