MS Dhoni in IPL: 


'ట్రైన్‌కు నువ్వెదురుళ్లినా నీకే రిస్కు... నీకు ట్రైన్‌ ఎదురొచ్చినా నీకే రిస్కు'.. ఇదీ బాలయ్య స్టైల్‌! 'ఆఖరి ఓవర్లో ఎంఎస్‌ ధోనీ క్రీజులో ఉంటే బౌలర్‌కే రిస్కు!'.. ఇదీ థలా స్టైల్‌! చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచే ఇందుకు నిదర్శనం!


41 ఏళ్లు.. డొమస్టిక్‌, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడటమే లేదు! అయినా ఎంఎస్ ధోనీ క్రీజులోకి వస్తే ప్రత్యర్థులు భయపడుతున్నారు. రాజస్థాన్‌పై ఛేదనలో అతడు కొట్టిన మూడు సిక్సర్లే ఇందుకు ఉదాహరణ.






8


తనలో ఇంకా పవర్‌ తగ్గలేదని.. తానింకా ఫినిషర్‌నే అని మహీ చాటి చెప్పాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరమైనప్పుడు అతడు బాదేసిన ట్విన్‌ సిక్సర్లు జస్ట్‌... అమేజింగ్‌! స్టాండ్స్‌లోని అభిమానులకు ఒక్కసారిగా గెలుపు ఆశలు కల్పించింది అతడి బ్యాటింగ్‌.


సీఎస్కే ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ను ఆడమ్‌ జంపా విసిరాడు. ధోనీ బ్యాటింగ్‌కు వచ్చి ఎంతో సేపు అవ్వలేదు. నాలుగో బంతిని ఎదుర్కొన్న అతడు దానిని సిక్సర్‌గా మలిచాడు. ఆఫ్‌సైడ్‌ తన రేంజులో పడ్డ బంతిని స్లాగ్‌స్వీప్‌తో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా స్టాండ్స్‌లో పెట్టేశాడు.


ఇక ఆఖరి 6 బంతుల్లో చెన్నైకి 21 పరుగులు అవసరం. యార్కర్లు సంధిచబోయి ఒత్తిడిలో సందీప్ శర్మ రెండుసార్లు వైడ్‌గా వేశాడు.  దాంతో విజయ సమీకరణం 6 బంతుల్లో 18గా మారింది. ఆఫ్‌సైడ్‌ వైడ్‌ యార్కర్‌గా వచ్చిన తొలి బంతిని ధోనీ డిఫెండ్‌ చేశాడు. ఆ తర్వాతి బంతి ఫ్యాడ్ల మీదకు లో ఫుల్‌టాస్‌గా రావడంతో ధోనీ దానిని డీప్ ఫైన్‌ లెగ్‌లో సిక్సర్‌గా మిలిచాడు. అంతే..! చెపాక్‌లో ఒక్కసారిగా ఈలలు గోలలు మొదలయ్యాయి.






మూడో బంతినీ సందీప్‌ మళ్లీ మిడిల్‌ వికెట్‌పై లో ఫుల్‌టాస్‌గా వేశాడు. క్రీజులో బ్యాక్‌ ఫుట్‌ తీసుకున్న మహీ దానిని డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా స్టాండ్స్‌లో పెట్టాడు. ఇంకేముందీ..! సీఎస్‌కే ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేసుకుంటూ సంబరాలు మొదలెట్టేశారు. కానీ సందీప్‌ శర్మ చివరి మూడు బంతులకు సింగిల్సే ఇవ్వడంతో ఫ్యాన్స్‌ ముఖాల్లో ఆనందం ఆవిరైంది. ఆఖరి బంతికి 5 రన్స్‌ అవసరం కాగా సందీప్‌ వేసిన అద్భుతమైన యార్కర్‌కు మహీ వద్ద జవాబు లేకుండా పోయింది.






ధోనీ మ్యాజిక్‌!


ఛేజింగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు గుడ్‌ స్టార్ట్‌ రాలేదు. సందీప్‌ శర్మ వేసిన 2.2వ బంతికే ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఔటయ్యాడు. అయితే వన్‌డౌన్‌లో అజింక్య రహానె (31; 19 బంతుల్లో 2x4, 1x6) అండతో మరో ఓపెనర్‌ డేవాన్‌ కాన్వే నిలబడ్డాడు. వీరిద్దరూ అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించారు. మరో వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. దాంతో పవర్‌ ప్లే ముగిసే సరికి సీఎస్కే 45/1తో నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ దూకుడు పెంచి రెండో వికెట్‌కు 43 బంతుల్లో 68 పరుగుల భాగస్వామ్యం అందించారు. రన్‌రేట్‌ పెరగకుండా అడ్డుకున్న ఈ జోడీని జట్టు స్కోరు 78 వద్ద రహానెను ఎల్బీ చేయడం ద్వారా అశ్విన్‌ విడదీశాడు. ఆ తర్వాత శివమ్‌ దూబె (8), మొయిన్‌ అలీ (7), అంబటి రాయుడు (1) వెంటవెంటనే ఔటవ్వడంతో మెరుగైన భాగస్వామ్యాలు రాలేదు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కాన్వే 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. 15వ ఓవర్ ఆఖరి బంతికి అతడిని చాహల్‌ ఔట్‌ చేశాడు. దాంతో విజయ సమీకరణం 12 బంతుల్లో 40గా మారింది. ధోనీ అండతో 19వ ఓవర్లో జడేజారెండు సిక్సులు, ఒక బౌండరీ బాది 19 రన్స్‌ అందించాడు. ఆఖరి ఓవర్లో 21 రన్స్‌ అవసరం కాగా.. సందీప్‌ శర్మ 17 రన్సే ఇచ్చాడు. అయితే మహీ వరుసగా రెండు సిక్సర్లు కొట్టి రాయల్స్‌ను భయపెట్టాడు. ఆఖరి బంతికి 5 రన్స్‌ అవసరం ఉండగా సింగిల్‌ మాత్రమే తీశాడు.