IPL 2022 tv ratings getting from BAD to WORSE for IPL Viewership : ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఆఖరికి చేరుకుంది. మరో వారం రోజుల్లో సీజన్‌ ముగుస్తుంది. కానీ ఈ పొట్టి క్రికెట్‌ పండుగను ప్రత్యక్షంగా వీక్షిస్తున్న వారి సంఖ్య తగ్గున్నట్టు తెలుస్తోంది. తాజాగా బార్క్‌ విడుదల చేసిన రేటింగ్స్‌లో  మే 7 నుంచి 13 వరకు ఐపీఎల్‌ను రేటింగ్స్‌ ఘోరంగా పడిపోయాయి. అంతకు ముందుతో పోలిస్తే ఐదో వారం ఈ సంఖ్య మరింత తగ్గింది. టాప్‌ 4 ఛానెల్స్‌ జాబితాలో స్టార్‌స్పోర్ట్స్‌ నాలుగో స్థానానికి పడిపోయింది.


ఐపీఎల్‌ 2022లో 52 నుంచి 60వ మ్యాచ్‌ వరకు మే 7-13 మధ్య జరిగాయి. ఇవన్నీ కీలకమైన మ్యాచులే. ఎందుకంటే ప్లేఆఫ్స్‌ స్థానాలను నిర్దేశించే మ్యాచులే. అయినప్పటికీ రేటింగ్స్‌ మాత్రం తగ్గాయి. స్టార్‌స్పోర్ట్స్ హిందీ ఛానెల్‌ నాలుగో స్థానానికి చేరుకుంది. సన్‌టీవీ, స్టార్‌ మా, స్టార్‌ ప్లస్‌ టాప్‌-3లో నిలిచాయి. మహారాష్ట్ర, దిల్లీ, తమిళనాడులోనూ రేటింగ్స్‌ దారుణంగా ఉన్నాయి. స్టార్‌ ఇండియా గ్రూప్ ఛానెళ్ల వ్యూయర్‌షిప్‌ అన్ని వయసుల వారీగా 30 శాతం వరకు తగ్గింది. దాంతో అడ్వర్టైజ్‌మెంట్‌ ఏజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే కొంత మంది ప్రకటనకర్తలు పరిహారం చెల్లించాల్సిందిగా స్టార్‌ను డిమాండ్‌ చేస్తున్నారని తెలిసింది.


'చూడండి, మేం 15 శాతం వరకు ఎక్కువ డబ్బు చెల్లించాం. కానీ నంబర్లు మాత్రం 28-30 శాతం వరకు తగ్గాయి. ఇది మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తోంది. అందుకే ఎంతో కొంత పరిహారం చెల్లించి సమస్యను పరిష్కరించాలని స్టార్‌స్పోర్ట్స్‌ను సంప్రదించాం' అని ఒక అడ్వర్టైజర్‌ చెప్పాడని ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌ రిపోర్టు చేసింది. మారుతీ సుజుకీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాత్సవ సైతం రేటింగ్స్‌ పడిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.


'ఈ సీజన్లోని తొలి 25 మ్యాచుల టీవీ రేటింగ్స్‌ ఒకసారి పరిశీలించండి. 22-40 ఏళ్ల వయస్కుల వీక్షణ 58 శాతం తగ్గిపోయింది. 30-35 శాతం పడిపోయిన 30-35 శాతం సగటు వ్యూయర్‌షిప్‌ కన్నా ఇదెంతో ఎక్కువ. అందుకే మేం అదనపు ఫ్రీ కమర్షియల్‌ టైమ్‌ గురించి స్టార్‌స్పోర్ట్స్‌తో చర్చిస్తున్నాం. అప్పుడే మా లక్ష్యాలు నెరవేరుతాయి' అని శశాంక్‌ అంటున్నారు.


వ్యూయర్‌షిప్‌ రేటింగ్స్‌ తగ్గుదల ప్రభావం ఐపీఎల్‌ మీడియా హక్కుల వేలంపై పడనుంది. ఈ సారి టీవీ నెట్‌వర్క్‌లు తక్కువ బిడ్డింగ్‌ వేసే అవకాశం ఉంది. బీసీసీఐ బిడ్డింగ్‌ ధరను తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.