IPL 2022: RR won the match by 29 runs against RCB in Match 39 at MCA Stadium: వాహ్‌..! రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుతం చేసింది. 144 స్కోరును కాపాడుకుంది. ఈ సీజన్లో అతి తక్కువ స్కోరును రక్షించుకుంది. ప్రత్యర్థి రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును 19.3 ఓవర్లకు 115కే ఆలౌట్‌ చేసింది. 29 రన్స్‌ తేడాతో గెలిచేసింది. డుప్లెసిస్‌ (23; 21 బంతుల్లో 3x4, 1x6), షాబాజ్‌ అహ్మద్‌ (17; 27 బంతుల్లో 1x6) టాప్‌ స్కోరర్లు. రవిచంద్రన్‌ అశ్విన్‌ (3 వికెట్లు), కుల్దీప్‌సేన్‌ (4), ప్రసిద్ధ్‌ (2) ఆర్సీబీని ఉక్కిరిబిక్కిరి చేశారు. అంతకు ముందు రాజస్థాన్‌లో రియాన్ పరాగ్‌ (56; 31 బంతుల్లో 1x4, 1x6) నాటౌట్‌గా నిలిచాడు. పవర్‌ఫుల్‌ హిట్టింగ్‌తో హాఫ్‌ సెంచరీ అందుకున్నాడు. సంజు శాంసన్‌ (27; 21 బంతుల్లో 1x4, 3x6) కీలక పరుగులు చేశాడు. ఆర్సీబీలో మహ్మద్‌ సిరాజ్‌, హేజిల్‌ వుడ్‌, హసరంగ తలో 2 వికెట్లు పడగొట్టారు.


RR బౌలింగ్‌కు RCB విలవిల
 
ముందున్న టార్గెట్‌ 145. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌. దాంతో ఆర్సీబీ ఈజీగా గెలుస్తుందనే అనిపించింది. కానీ రాజస్థాన్‌ బౌలర్లు అలా కానివ్వలేదు. అద్భుతమైన లెంగ్తుల్లో బంతులేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. రెండో ఓవర్లోనే విరాట్‌ కోహ్లీ (9)ని ప్రసిద్ధ్‌ కృష్ణ ఔట్‌ చేశాడు. పవర్‌ప్లేలో డుప్లెసిస్ కాస్త అటాకింగ్‌ షాట్లు ఆడటంతో కొద్దిగా స్కోరు వచ్చింది. జట్టు స్కోరు 37 వద్ద వరుస బంతుల్లో డుప్లెసిస్‌, మాక్స్‌వెల్‌ (0)ను కుల్దీప్‌సేన్‌ పెవిలియన్‌ పంపించాడు. దాంతో ఆర్సీబీ 9 ఓవర్లకు 55/3తో కష్టాల్లో నిలిచింది. రన్‌రేట్‌ తగ్గడంతో ఒత్తిడి పెరిగింది. షాట్లు ఆడే క్రమంలో రజత్‌ పాటిదార్‌ (16), ప్రభుదేశాయ్‌ (2) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. షాబాజ్‌ అహ్మద్‌తో సమన్వయ లోపంతో దినేశ్‌ కార్తీక్‌ (6) రనౌట్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 72. మరో 20 పరుగులకు షాబాజ్‌ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. రెండు బౌండరీలు కొట్టిన హసరంగ (18)ను కుల్దీప్‌సేన్‌  కాట్‌ అండ్‌ బౌల్‌గా పంపించేశాడు. దాంతో ఆర్సీబీ ఓటమి ఖరారైపోయింది.


పరాగ్‌ 'పవర్‌' హిట్టింగ్‌


టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌కు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ (7)ను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రవిచంద్రన్‌ అశ్విన్‌ (17; 9 బంతుల్లో 4x4)నూ అతడే 3.6వ బంతికి పెవిలియన్‌ పంపించాడు. వరుస సెంచరీలతో ఊపుమీదున్న జోస్‌ బట్లర్‌ (8)ని జోష్‌ హేజిల్‌వుడ్‌ ఆ తర్వాత బంతికే ఔట్‌ చేయడంతో 33/3తో రాజస్థాన్‌ కష్టాల్లో పడింది.


అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ సంజు శాంసన్‌ ఏమాత్రం భయపడలేదు. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. చక్కని బౌండరాలు, సిక్సర్లు కొట్టాడు. డరైల్‌ మిచెల్‌ (16; 24 బంతుల్లో) స్వల్ప భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో అతడిపై మెరుగైన రికార్డున్న మిస్టరీ స్పిన్నర్‌ హసరంగను డుప్లెసిస్‌ ప్రయోగించాడు. అతడి బౌలింగ్‌ను గౌరవించకుండా రివర్స్‌ స్వీప్‌ ఆడబోయి సంజు క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అప్పటికి స్కోరు 68.


మరోవైపు మిచెల్‌ భారీ షాట్లు ఆడేందుకు ప్రయత్నించినా కనెక్ట్‌ అవ్వకపోవడంతో 14.2వ బంతికి ఔటయ్యాడు. కొద్దిసేపట్లోనే హెట్‌మైయిర్ (3)ను హసరంగే ఔట్‌ చేశాడు. వికెట్లు పడుతున్నా సరే రాజస్థాన్‌ చిచ్చరపిడుగు పరాగ్‌ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. దొరికిన బంతిని బౌండరీకి పంపించాడు. హర్షల్‌ పటేల్‌ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు, ఒక బౌండరీ బాది 18 పరుగులు సాధించాడు. దాంతో స్కోరు 144కు చేరుకుంది.