ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 178 పరుగులు చేసింది. రాజస్తాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (41: 29 బంతుల్లో, ఆరు ఫోర్లు, ఒక సిక్సర్), దేవ్‌దత్ పడిక్కల్ (39: 18 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) రాణించారు. లక్నో విజయానికి 120 బంతుల్లో 179 పరుగులు కావాలి.


టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్తాన్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ జోస్ బట్లర్ (2: 6 బంతుల్లో)... అవేష్ ఖాన్ బౌలింగ్‌లో ర్యాంప్ షాట్‌కు ప్రయత్నించి క్లీన్ బౌల్డయ్యాడు. కానీ యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజు శామ్సన్ (32: 24 బంతుల్లో, ఆరు ఫోర్లు) వేగంగా ఆడుతూ రన్‌రేట్ తగ్గనివ్వలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 40 బంతుల్లోనే 64 పరుగులు జోడించారు.


అయితే సంజు శామ్సన్, యశస్వి జైస్వాల్ ఇద్దరూ రెండు పరుగుల వ్యవధిలోనే అవుటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన దేవ్‌దత్ పడిక్కల్ కాసేపు విధ్వంసం సృష్టించాడు. ఉన్నది కాసేపే అయినా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన దేవ్‌దత్ పడిక్కల్... కృనాల్ పాండ్యా చేతికి చిక్కాడు.


ఆ తర్వాత రియాన్ పరాగ్ (17: 16 బంతుల్లో, ఒక సిక్సర్), జిమ్మీ నీషం (14: 12 బంతుల్లో, రెండు ఫోర్లు) ఆశించినంత వేగంగా ఆడకపోయినా ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (17 నాటౌట్: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) చిన్నపాటి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రాజస్తాన్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ట్రెంట్ బౌల్ట్ ఐపీఎల్ కెరీర్‌లో మొదటి ఫోర్ ఈ మ్యాచ్‌లోనే కొట్టాడు. గతంలో తన ఖాతాలో ఒక సిక్సర్ మాత్రమే ఉంది. 


రాజస్తాన్ తరఫున ఏకంగా ఎనిమిది మంది బౌలింగ్ చేశారు. రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా... అవేష్ ఖాన్, జేసన్ హోల్డర్, అయుష్ బదోనిలకు తలో వికెట్ దక్కింది.