ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విషాదం ఎదురైంది. ప్లేఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఐదు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


హిట్టర్లున్నా భారీ స్కోరు చేయలేక..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. స్కోరు బోర్డుపై 50 పరుగులు చేరే సరికి డేవిడ్ వార్నర్ (5: 6 బంతుల్లో, ఒక ఫోర్), మిషెల్ మార్ష్ (0: 1 బంతి), పృథ్వీ షా (24: 23 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్), సర్ఫరాజ్ ఖాన్ (10: 7 బంతుల్లో) అవుటయ్యారు.


ఈ దశలో రిషబ్ పంత్ (39: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్), రొవ్‌మన్ పావెల్ (43: 34 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 75 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో 18 పరుగుల వ్యవధిలోనే ఇద్దరూ అవుటయ్యారు. చివర్లో అక్షర్ పటేల్ సిక్సర్లతో చెలరేగడంతో ఢిల్లీ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రాకు మూడు వికెట్లు, రమణ్‌దీప్ సింగ్‌కు రెండు వికెట్లు దక్కగా... మర్కండే, డేనియల్ శామ్స్ చెరో వికెట్ తీసుకున్నారు.


ఎక్కడా ఒత్తిడి పడకుండా...
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (2: 13 బంతుల్లో) క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో పెవిలియన్ బాట పట్టాడు. అయితే ఇషాన్ కిషన్ (48: 35 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డెవాల్డ్ బ్రెవిస్ (37: 33 బంతుల్లో, ఒక ఫోర్, మూడు సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. అయితే మూడు ఓవర్ల వ్యవధిలో వీరు కూడా అవుటయ్యారు.


ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలవకపోయినా... దారుణంగా విఫలం కూడా కాకపోవడంతో ముంబై ఎక్కడా తడబడలేదు. సాధించాల్సిన రన్‌రేట్ 12కి పైగా ఉన్న దశలో టిమ్ డేవిడ్ (34: 11 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో కొట్టాల్సిన స్కోరు బాగా తగ్గిపోయింది. 19వ ఓవర్లో తిలక్ వర్మ (21: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) అవుటైనా... రెండు బౌండరీలతో రమణ్ దీప్ సింగ్ (13 నాటౌట్: 6 బంతుల్లో, రెండు ఫోర్లు) మ్యాచ్ ముగించాడు.