ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ముంబై ఇండియన్స్ 14. ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.


98 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి కూడా ఆరంభంలో కష్టాలు ఎదురయ్యాయి. కేవలం 33 పరుగులకే ఎంఐ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో తిలక్ వర్మ (34 నాటౌట్: 32 బంతుల్లో, నాలుగు ఫోర్లు), హృతిక్ షౌకీన్ (18: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) ముంబైని ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 48 పరుగులు జోడించారు. విజయానికి కొద్ది దూరంలో షౌకీన్ అవుటయినా... టిమ్ డేవిడ్ (16 నాటౌట్: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు) రెండు సిక్సర్లతో మ్యాచ్ ముగించాడు. చెన్నై బౌలర్లలో ముకేష్ చౌదరి మూడు వికెట్లు తీయగా... సిమర్ జిత్ సింగ్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది.


అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయింది. చెన్నై టాప్ ఆర్డర్ బ్యాటర్లు అత్యంత పేలవమైన ప్రదర్శన చేశారు. మొదటి నలుగురు బ్యాట్స్‌మెన్ కలిపి చేసిన పరుగులు కేవలం ఎనిమిది మాత్రమే. ఐదు పరుగులకే మూడు వికెట్లు, 29 పరుగులకే ఐదు వికెట్లను చెన్నై కోల్పోయింది. డ్వేన్ బ్రేవో, ధోని ఏడో వికెట్‌కు జోడించిన 39 పరుగులే ఇన్సింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. వీరి భాగస్వామ్యం బలపడుతుందనే లోపే కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో నిర్లక్ష్యంగా షాట్ ఆడి బ్రేవో అవుటయ్యాడు.


ఒక ఎండ్‌లో ధోని నిలబడ్డా మరో ఎండ్‌లో వికెట్లు టపటపా పడిపోయాయి. దీంతో చెన్నై 15.5 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో డేనియల్ శామ్స్ మూడు వికెట్లు తీయగా... మెరెడిత్, కుమార్ కార్తికేయ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. రమణ్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రాలు తలో వికెట్ పడగొట్టారు.