ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 19.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ టైటాన్స్ తరఫున అత్యధిక స్కోరు సాధించిన సాహాకు (67 నాటౌట్: 57 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్) మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


ఆఖర్లో తడబడి...
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నైకి ఆశించిన ఆరంభం లభించలేదు. ఫాంలో ఉన్న ఓపెనర్ డెవాన్ కాన్వే (5: 9 బంతుల్లో) మూడో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53: 49 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), మొయిన్ అలీ (21: 17 బంతుల్లో, రెండు సిక్సర్లు) వేగంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 6.2 ఓవర్లలోనే 53 పరుగులు జోడించారు.


అయితే మొయిన్ అలీ అవుటయ్యాక చెన్నై ఇన్నింగ్స్‌లో ఊపు పూర్తిగా పడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ నెమ్మదించడంతో పాటు రాయుడు స్థానంలో వచ్చిన జగదీషన్ (39: 33 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) వేగంగా ఆడలేకపోయాడు. ధోని (7: 10 బంతుల్లో), శివం దూబే (0: 2 బంతుల్లో) మరోసారి విఫలం అయ్యారు.


చివరి ఐదు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 24 పరుగులు మాత్రమే చెన్నై సాధించగలిగింది. దీంతో 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ రెండు వికెట్లు తీయగా... రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిషోర్‌లకు తలో వికెట్ దక్కింది.


నింపాదిగా ఆడుతూ..
136 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఇన్నింగ్స్‌ను వేగంగా ప్రారంభించింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (18: 17 బంతుల్లో, మూడు ఫోర్లు), వృద్ధిమాన్ సాహా బౌండరీలతో చెలరేగారు. మొదటి వికెట్‌కు కేవలం 7.1 ఓవర్లలోనే 59 పరుగులు జోడించి లక్ష్యాన్ని సులభం చేశారు.


అయితే గిల్ తర్వాత వేడ్ (20: 15 బంతుల్లో, రెండు ఫోర్లు), హార్దిక్ పాండ్యా (7: 6 బంతుల్లో, ఒక ఫోర్) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కొట్టాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో సాహా, డేవిడ్ మిల్లర్ (15 నాటౌట్: 20 బంతుల్లో, ఒక ఫోర్) నింపాదిగా ఆడారు. 19.1 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో మతీష పతిరాణాకు రెండు వికెట్లు దక్కాయి. మొయిన్ అలీ ఒక వికెట్ తీసుకున్నాడు.