ఐపీఎల్‌లో 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మిషెల్ మార్ష్ (63: 48 బంతుల్లో, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో లియాం లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. పంజాబ్ విజయానికి 120 బంతుల్లో 160 పరుగులు కావాలి.


టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. ఫాంలో ఉన్న ఓపెనర్ డేవిడ్ వార్నర్ (0: 1 బంతి) మొదటి బంతికే లియాం లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కానీ ఆ ఒత్తిడి జట్టుపై పడకుండా మరో ఓపెనర్ సర్ఫరాజ్ ఖాన్, మిషెల్ మార్ష్ వేగంగా ఆడారు.వీరిద్దరూ రెండో వికెట్‌కు 29 బంతుల్లోనే 51 పరుగులు జోడించారు. ఈ జోడి భాగస్వామ్యం బలపడుతున్న దశలో అర్ష్‌దీప్ సింగ్.. సర్ఫరాజ్ ఖాన్‌ను పెవిలియన్‌కు పంపించాడు.


ఆ తర్వాత వచ్చిన లలిత్ యాదవ్... మిషెల్ మార్ష్‌కు చక్కటి సహకారం అందించాడు. మూడో వికెట్‌కు వీరు 47 పరుగులు జోడించారు. ఈ పార్ట్‌నర్‌షిప్‌ను కూడా అర్ష్‌దీప్ సింగే బ్రేక్ చేశాడు. లలిత్ యాదవ్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. లలిత్ అవుటయ్యాక ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. రిషబ్ పంత్, రొవ్‌మన్ పావెల్ విఫలం అయ్యారు. దీనికి తోడు అక్షర్ పటేల్ బంతులు వృథా చేశాడు.


దీంతో మిషెల్ మార్ష్ మీద ఒత్తిడి పడింది. తను భారీ షాట్లకు వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. 19వ ఓవర్లో భారీ షాట్‌కు ప్రయత్నించి మార్ష్ కూడా అవుటయ్యాడు. చివరి రెండు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా రాకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితం అయింది. పంజాబ్ బౌలర్లలో లియాం లివింగ్‌స్టోన్, అర్ష్‌దీప్ సింగ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. కగిసో రబడ ఒక వికెట్ తీశాడు.