ఐపీఎల్‌లో సోమవారం మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్, ఏడో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. ఇది రెండు జట్లకు కీలక మ్యాచ్. ఎందుకంటే చూడటానికి ఢిల్లీ పైన, పంజాబ్ కింద ఉన్నట్లు అనిపించినప్పటికీ రెండిటి పాయింట్లు సమానంగానే ఉన్నాయి. కేవలం నెట్ రన్‌రేట్ వల్ల మాత్రమే ఢిల్లీ టాప్-4కు చేరువలో ఉంది.


ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా టాప్-4కు చేరనుంది. కాబట్టి విజయం కోసం రెండు జట్లూ సర్వశక్తులూ ఒడ్డుతాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ వన్‌సైడెడ్‌గా గెలిచేసింది. 119 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించింది.


ఇక తుదిజట్ల విషయానికి వస్తే... ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులు చేసింది. చేతన్ సకారియా స్థానంలో ఖలీల్ అహ్మద్, కేఎస్ భరత్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. పంజాబ్ మాత్రం ఎటువంటి మార్పులూ చేయలేదు.


ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు
డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, మిషెల్ మార్ష్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), లలిత్ యాదవ్, రొవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఆన్రిచ్ నోర్జే, ఖలీల్ అహ్మద్


పంజాబ్ కింగ్స్ తుదిజట్టు
జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భనుక రాజపక్స, లియాం లివింగ్ స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్