ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 91 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం ఢిల్లీ ఓవర్లలో 17.4 పరుగులకు 114 ఆలౌట్ అయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నెట్ రన్‌రేట్ కూడా భారీగా పెరిగింది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్‌రేట్ భారీగా పడిపోయింది. పరుగుల పరంగా ఇది చెన్నైకి నాలుగో అతిపెద్ద విజయం కావడం విశేషం.


మళ్లీ అదరగొట్టిన చెన్నై ఓపెనర్లు
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే (87: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (41: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) మంచి ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 70 బంతుల్లోనే 110 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ను నిదానంగా మొదలు పెట్టిన వీరు నెమ్మదిగా స్కోరు వేగాన్ని పెంచారు. రన్‌రేట్‌ను 10కి తీసుకెళ్లారు. వీరి బ్యాటింగ్ ధాటికి చెన్నై 10 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. కాన్వే అర్థ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు.


11వ ఓవర్ చివరి బంతికి ఆన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. దీంతో డెవాన్ కాన్వేకు శివం దూబే (32: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జతకలిశాడు. 80ల్లోకి వచ్చాక డెవాన్ కాన్వే కొంచెం నెమ్మదించినా... శివం దూబే వేగం తగ్గనివ్వలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. సెంచరీకి 13 పరుగుల దూరంలో ర్యాంప్ షాట్‌కు ప్రయత్నించిన డెవాన్ కాన్వే రిషబ్ పంత్‌కు చిక్కాడు. తర్వాతి ఓవర్లోనే శివం దూబే కూడా పెవిలియన్ చేరాడు.


ఆఖర్లో మహేంద్ర సింగ్ ధోని (21 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) తన మార్కు మెరుపులు మెరిపించడంతో చెన్నై 200 మార్కును దాటింది. 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్  ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జేకు మూడు వికెట్లు దక్కాయి. ఖలీల్ రెండు వికెట్లు, మిషెల్ మార్ష్ ఒక వికెట్ తీసుకున్నారు.


చావుదెబ్బ కొట్టిన చెన్నై బౌలర్లు
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెన్నై తరహా ఆరంభం లభించలేదు. ఓపెనర్ కేఎస్ భరత్ (8: 5 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం అయ్యాడు. దీంతో ఢిల్లీ 16 పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. ఒక దశలో కేవలం 13 పరుగుల తేడాలో ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది.


ఫాంలో ఉన్న డేవిడ్ వార్నర్ (19: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు), మిషెల్ మార్ష్ (25: 20 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), రిషబ్ పంత్ (21: 11 బంతుల్లో, నాలుగు ఫోర్లు), రొవ్‌మన్ పావెల్ (3: 9 బంతుల్లో) అందరూ విఫలం అయ్యారు. చివర్లో శార్దూల్ ఠాకూర్ (24: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) కాస్త పోరాడినా అది పరుగుల అంతరాన్ని కాస్త మాత్రమే తగ్గించగలిగింది. వార్నర్, మార్ష్, పంత్, శార్దూల్ ఠాకూర్ మినహా ఎవరూ రెండంకెల స్కోరు చేరుకోలేకపోయారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఓవర్లలో పరుగులకు ఆలౌట్ అయింది.


చెన్నై బౌలర్లలో మొయిన్ అలీకి మూడు వికెట్లు దక్కాయి. ముకేష్ చౌదరి, బ్రేవో, సిమర్‌జిత్ సింగ్‌లు రెండేసి, మహీష్ ధీక్షణ ఒక వికెట్ తీసుకున్నారు.