ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో వికెట్లు నష్టపోయి పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (87: 49 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓపెనర్లు డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్ (41: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు కేవలం 70 బంతుల్లోనే 110 పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా మొదలు పెట్టిన వీరు నెమ్మదిగా స్కోరు వేగాన్ని పెంచారు. రన్‌రేట్‌ను 10కి పెంచారు. వీరి బ్యాటింగ్‌కు చెన్నై 10 ఓవర్లలోనే 100 పరుగుల మార్కును దాటింది. ఈ లోపే కాన్వే అర్థ సెంచరీ కూడా చేసుకున్నాడు.


అయితే 11వ ఓవర్ చివరి బంతికి ఆన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రుతురాజ్ గైక్వాడ్ అవుటయ్యాడు. ఈ దశలో డెవాన్ కాన్వేకు శివం దూబే (32: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) జతకలిశాడు. 80ల్లోకి వచ్చాక కాన్వే కొంచెం నెమ్మదించినా... శివం దూబే స్కోరు వేగం తగ్గనివ్వలేదు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 33 బంతుల్లోనే 59 పరుగులు జోడించారు. సెంచరీకి చేరువలో ర్యాంప్ షాట్‌కు ప్రయత్నించిన డెవాన్ కాన్వే రిషబ్ పంత్‌కు చిక్కాడు. ఆ తర్వాతి ఓవర్లోనే శివం దూబే కూడా అవుటయ్యాడు.


చివర్లో మహేంద్ర సింగ్ ధోని (21 నాటౌట్: 8 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) తన మార్కు మెరుపులు మెరిపించడంతో చెన్నై 200 మార్కును దాటింది. 20 ఓవర్లు ముగిసేసరికి చెన్నై సూపర్ కింగ్స్  ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ఆన్రిచ్ నోర్జే మూడు వికెట్లు తీసుకున్నాడు. ఖలీల్‌కు రెండు వికెట్లు, మిషెల్ మార్ష్‌కు ఒక వికెట్ దక్కాయి.