ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్థిక పాండ్య గాయాల బారిన పడి చాలా కాలంగా ఆటకు దూరమయ్యాడు. ఆడిన మ్యాచ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ ఆల్‌రౌండర్‌ ... ఐపీఎల్‌లో కూడా అదే జోరు కొనసాగించాడు. ముఖ్యంగా గాయాల బెడద నుంచి కోలుకున్న తర్వాత మరింత దూకుడు పెంచాడు. 


మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు హార్ధిక్. 
ఐపీఎల్‌ 2022 కీలక దశకు చేరుకుంటున్న టైంలో హార్ధిక పాండ్య ఫిట్‌నెస్‌పై అనుమానాలు కలుగుతున్నాయి. అందులోనూ గత రెండు మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేయకపోవడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. 


హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఐదుగురు బౌలర్లనే ప్రయోగించాడు హార్ధిక్. అంటే ఒక్కో బౌలరు నాలుగు ఓవర్లు వేశాడు. ఇందులో చాలా మంది భారీగానే పరుగులు సమర్పించుకున్నారు. అయినా హార్ధిక్‌ మాత్రం బౌలింగ్‌ చేయలేదు. రషీద్‌ ఖాన్, లాకీ పెర్గూసన్‌ లాంటి బౌలర్లు 45, 52 పరుగులు ఇచ్చినప్పటికీ హార్ధిక్‌ పాండ్య బౌలింగ్ చేయడానికి సాహసించలేదు. 


ఇదే విషయంపై మ్యాచ్‌ చివర్లో హార్ధిక్‌ను అడిగితే క్లారిపై ఇచ్చాడు. టోర్నమెంట్‌లో ఉన్న పరిస్థితులు, షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకొని కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. 


తాను బౌలింగ్ చేయకూడదని ముందే చర్చించుకొని తీసుకున్న నిర్ణయమని చెప్పాడు హార్ధిక్‌. అయితే జట్టుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు బౌలంగ్ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించాడు. ఇది చాలా పెద్ద టోర్నమెంట్. త్వరగా అలసిపోవడానికి ఏ ఆటగాడు సిద్ధంగా ఉండడు.


నిన్న జరిగిన మ్యాచ్‌లో నాటకీయ పరిణామాల మధ్య గుజరాత్ విజయం సాధించింది. చివరి ఓవర్‌లో రషీద్‌ ఖాన్, తెవాతియా మెరుపు ఇన్నింగ్స్‌తో 22 పరుగులు సాధించింది విజయాన్ని ముద్దాడింది గుజరాత్‌. ఈ విజయాల వెనుక ఫ్రాంచైజీకు చెందిన సహాయక సిబ్బంది చాలా కష్టపడుతున్నారని కితాబిచ్చాడు హార్ధిక్. 


ఇలాంటి సమయంలో విజయాలు సాధించాలంటే చాలా ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. జట్టులో సానూకూల ఆలోచన ఉండాలి. డగౌట్‌లో ఇలాంటి వాతావరణం ఉండటానికి ప్రధాన కారణం మా సహాయ సిబ్బందిదే. ప్లేయర్లను వాళ్లు ట్రీట్ చేస్తున్న విధానమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. 


హైదరాబాద్‌పై విజయంతో గుజరాత్‌  పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిపోయింది. ఐదు మ్యాచ్‌ల తర్వాత సన్‌రైజర్స్‌కు తొలి ఓటమి ఎదురైంది. బుధవారం జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ చివరి బంతికి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.